మహిళా ఐఎఎస్ కూ తప్పని వేధింపులు: సొంత కార్యాలయంలోనే అసభ్య ప్రవర్తన!
న్యూఢిల్లీ: పని చేసే చోట మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురి కావడం, తోటి ఉద్యోగుల అసభ్య ప్రవర్తన బారిన పడటాన్ని నిరోధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టినప్పటికీ.. అవేవీ ఉపయోగం లేకుండా పోయాయనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. ఓ మహిళా ఐఎఎస్ అధికారిణి సైతం అసభ్య ప్రవర్తనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఈ ఉదంతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలకలాన్ని రేపింది. ఈ ఘటనపై ఆరా తీయాల్సిన అవసరం ఉందంటూ ఐఎఎస్ అధికారుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
విక్రమ్ ల్యాండర్ ఫొటోలు ఇవిగో: చంద్రుడి ఉపరితలాన్ని జల్లెడ పట్టిన నాసా: అయినా నిరాశే!
ఆ ఐఎఎస్ అధికారిణి పేరు వర్షా సింగ్. ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేస్తున్నారు. రెండురోజుల కిందట ఢిల్లీకే చెందిన ఓ మహిళా రోడ్ సైడ్ రోమియోల గురించి ఆమెకు ఫిర్యాదు చేశారు. తాను రోజూ రాకపోకలు సాగించే ప్రదేశంలో కొందరు పోకిరీలు 24 గంటల పాటు తిష్ఠ వేసుకుని కూర్చుంటున్నారని, ఆ మార్గంలో తిరిగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. పట్టపగలే హుక్కా పీలుస్తూ, పేకాట ఆడుతూ వచ్చీ పోయే మహిళల పట్ల అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా తీశారు. దాన్ని తన ఫిర్యాదుకు జోడించారు.
దీనికి వర్షా సింగ్ స్పందించారు. దేశ రాజధానిలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలు స్వేచ్ఛగా జీవించడం గగనమైందని అన్నారు. మహిళా ఐఎఎస్ అధికారైన తాను కూడా ప్రతి రోజూ సొంత కార్యాలయంలో, సొంత ఛాంబర్ లోనే అసభ్య ప్రవర్తనకు గురి అవుతున్నానని అంటూ ఆ మహిళకు బదులు ఇచ్చారు. ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే ధ్యాస కూడా లేకుండా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వర్షా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారమేంటీ? అని ఆ మహిళకు ఎదురు ప్రశ్న వేస్తూ వర్షా సింగ్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది.
While this could indeed be a matter for the police, its a challenge women face 24/7 across North India. I face it in my own office chamber- misbehaviour, entitled behaviour, and violation of my space by men who simply do not understand what they are doing. What are the solutions? https://t.co/levsfQ1INB
— Varsha Joshi (@suraiya95) September 25, 2019
దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం ఛైర్మన్ జయప్రకాశ్ స్పందించారు. ఈ విషయంపై ఆరా తీస్తామని అన్నారు. పని చేసే చోట సురక్షిత వాతావరణాన్ని కల్పించడానికి అందుబాటులో ఉన్న అన్ని చర్యలను తీసుకుంటామని అన్నారు. ఓ మహిళా ఐఎఎస్ అధికారి పట్ల సొంత కార్యాలయంలోనే వేధింపులకు గురి కావడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ సుర్జీత్ పన్వర్ చెప్పారు. కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పనిచేసే చోట మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఢిల్లీ పోలీసులపై ఉందని చెప్పారు.