ఫ్లాష్ బ్యాక్: పాక్ జైలు గోడలు బద్దలుకొట్టుకొచ్చిన భారత వైమానిక దళ పైలట్లు!
1971 యుద్ధం సమయంలో దురదృష్టవశాత్తు పాక్ సైన్యం చేతికి చిక్కిన భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులు పాక్ జైలు నుంచి బయటపడేందుకు చేసిన వీరోచిత ప్రయత్నమిది.
న్యూఢిల్లీ: ''మేం శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి పోరాడతాం. ఒక్క తూటాతో మా విమానం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ నేను యుద్ధఖైదీగా శత్రువుల చేతికి చిక్కితే.. నేను కచ్చితంగా తప్పించుకుంటా..''
ఫ్లాష్ బాక్: ఒకే ఒక్కడు.. 150 మంది చైనా సైనికులను మట్టుబెట్టాడు
1968లో ఒక ఆహ్లాదకరమైన రాత్రివేళ భోజనం చేస్తూ.. ఫ్లయిట్ లెఫ్టినెంట్ దిలీప్ పారుల్కర్ తన కమాండింగ్ అధికారి ఎం.ఎస్.బావాతో అన్న మాటలివి. మూడేళ్ల తర్వాత 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం చెలరేగినప్పుడు ఈ మాటలు నిజమయ్యాయి.
అసలేం జరిగిందంటే...
1971లో పాకిస్తాన్ తో యుద్ధం చెలరేగేటప్పటికి ఫ్లయిట్ లెఫ్టినెంట్ దిలీప్ పారుల్కర్ వయసు 29 ఏళ్లు. ఆ ఏడాది డిసెంబర్ 10న ఆయన తన సుఖోయ్-7 యుద్ధవిమానంతో పాక్లోని ఒక రాడార్ కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు బయలుదేరాడు.
విధి వక్రించి.. బందీగా...
అయితే విధి వక్రించింది. పాక్ సైనికులు పారుల్కర్ యుద్ధవిమానాన్ని గాల్లోనే పేల్చివేశారు. అదృష్టవశాత్తూ పారాచూట్ సాయంతో కిందకి దిగిన అతడిని దురదృష్టం వెక్కిరించింది. బిలబిలమంటూ పాక్ సైనికులు అతడ్ని చుట్టుముట్టారు. వారు అతడిని రావల్పిండికి సమీపంలోని ఒక కారాగార శిబిరంలో నిర్బంధించారు.
యుద్ధం ముగిసినా.. బందీలుగానే...
ఆ కారాగార శిబిరంలో అప్పటికే భారత వైమానిక దళానికి చెందిన ఇతర పైలట్లు ఎం.ఎస్.గ్రేవాల్, హరీశ్ సిన్హ్జీలు కూడా నిర్బంధంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజులకు భారత్ పాక్ నడుమ యుద్ధం ముగిసింది. అయినా పాక్ ప్రభుత్వం వీరిని విడిచిపెట్టకుండా బందీలుగానే ఉంచింది.
సినీ ఫక్కీలో తప్పించుకుందామని...
తొలుత పారుల్కర్ ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. పాక్ వైమానిక దళ సిబ్బంది ఒకరిని పట్టుకొని.. అతడి తలకు రివాల్వర్ను గురిపెట్టి, తనను విమానంలో దిల్లీకి తీసుకెళ్లాలని బెదిరిద్దామనుకున్నారు. అయితే అంతలోనే ఆ ఆలోచనను విరమించుకున్నాడు.
పరారీకి వ్యూహ రచన...
ఆ తర్వాత మూడు నెలల పాటు పారుల్కర్, గ్రేవాల్, హరీశ్లు మౌనంగా ఉండిపోయారు. యుద్ధం ముగిసిన నేపథ్యంలో తమను భారత్ కు అప్పజెబుతారని వారు భావించారు. అలాంటిదేదీ జరగకపోవడంతో పరారీకి వ్యూహరచన చేయడం మొదలుపెట్టారు.
అర్థరాత్రి జైలుగోడను బద్దలు కొట్టుకుని...
ఒక రోజున అదృష్టం కలిసి వచ్చింది. పాక్ సైనికులు వీరున్న సెల్ ను మార్చారు. అప్పటి నుంచి.. 18 అంగుళాల మందమున్న ఆ జైలు గోడను ప్రతీ రాత్రి ఒక పదునైన వస్తువుతో తవ్వడం మొదలుపెట్టారు. దాదాపు రెండు నెలలు తర్వాత 1972 ఆగస్టు 13న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పారుల్కర్, ఎం.ఎస్.గ్రేవాల్, హరీశ్లు జైలు నుంచి బయటపడ్డారు.
మళ్లీ వెంటాడిన దురదృష్టం...
పఠాన్ దుస్తులు ధరించి, నీరు, ఔషధాలు, ఎండు పళ్లు, రూ.600 సొమ్ముతో ముగ్గురూ రోడ్డుపైకొచ్చారు. ఆ తర్వాత 12 గంటల పాటు ప్రయాణం సాగించి.. పెషావర్ చేరారు. అక్కడి నుంచి జామ్రౌద్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఐదారు చెక్ పాయింట్లను తెలివిగా దాటేశారు. కానీ, లాండీ కోటాల్లో ఒక పొరపాటు కారణంగా వారు దొరికిపోయారు.
మళ్లీ మూడు నెలలు నిర్బంధంలో...
పాకిస్తాన్ లో ఎప్పుడో లాండీ ఖానా అనే రైల్వే స్టేషన్ ను మూసేశారు. అయితే ఆ విషయం మన వైమానిక దళ వీరులకు తెలియదు. దీంతో ఆ రైల్వేస్టేషన్ కోసం అందర్ని వాకబు చేయడం మొదలుపెట్టారు. అదే వారు చేసిన తప్పిదమైంది. వీరి ఆచూకీ పాక్ సైనికులకు తెలిసిపోయింది. దీంతో మళ్లీ మూడు నెలల పాటు వారు నిర్బంధంలో ఉన్నారు. ఎట్టకేలకు వారిని భారత్కు అప్పగించాలని పాక్ నిర్ణయించడంతో 1972 డిసెంబర్ 1న స్వదేశానికి తిరిగి చేరుకున్నారు.
ఎలా తప్పించుకోవాలన్నదే మా ఆలోచన...
స్వదేశానికి తిరిగొచ్చాక పారుల్కర్.. మళ్లీ భారత వైమానిక దళంలో చేరారు. ఇప్పుడు ఆయన వయసు 74 ఏళ్లు. నాటి అనుభవాలను ఆయన ఇప్పుడు వెల్లడించారు. పాక్ సైనికులకు యుద్ధఖైదీగా చిక్కాక.. తమకు శత్రువు నిర్బంధం నుంచి తప్పించుకోవడం మినహా మరో ఆలోచన రాలేదని, ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాల గురించి కూడా తాము భయపడలేదని ఆయన చెప్పారు.
బాలీవుడ్ తెరకెక్కనున్న నాటి సాహసగాధ...
రోమాంఛితమైన ఈ సాహసగాధ ఇప్పుడు బాలీవుడ్లో సినిమా కథగా మారింది. ‘ద గ్రేట్ ఇండియన్ ఎస్కేప్' పేరుతో దర్శకుడు తరణజీత్ సింగ్ దీన్ని తెరకెక్కిస్తున్నారు.