రామ మందిరం భారత్లో కాక ఇంకెక్కడ, ఆపలేరు: అఖిలేష్ పార్టీ ముస్లీం నేత
ఢిల్లీ: సమాజ్వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్కు, ఆ పార్టీ నేత, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మునావర్ సలీమ్ రామమందిరం అంశంపై షాకిచ్చారు! అంతేకాదు, రామ మందిరాన్ని భారత దేశంలో కాకుండా ఇంకెక్కడ నిర్మించగలమని ప్రశ్నించారు.
మునావర్ సలీమ్ చౌదరి రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికారు. ఆలయాన్ని నిర్మించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రామ మందిర నిర్మాణాలను ఎవరు ఆపలేరన్నారు. భారత్లో కాకుండా రామాలయాలు ఎక్కడ కట్టగలమన్నారు.
మునావర్ సలీమ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషకు చెందిన నాయకుడు. ఆయన సమాజ్ వాది పార్టీ నేత. ఆ పార్టీ ఆయనను 2012లో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇటీవలే పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ ఆయనను అజంగర్, హత్రాస్, ఈటాల ఇంచార్జీగా నియమించారు.
స్వాగతించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
మునావర్ సలీమ్ చౌదరి వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు లక్ష్మీకాంత్ బాజపాయి స్వాగతించారు. అదే సమయంలో ఆయనకు ఓ సూచన చేశారు. సలీమ్ చౌదరి తన మనసులోని మాటను చెప్పారని, కానీ ఈ వ్యాఖ్యలు చేసే ముందు ఆయన వారి పార్టీకి చెందిన అజమ్ ఖాన్ను అడిగారా అని ప్రశ్నించారు.