ఆటో డ్రైవర్ ముసుగులో బినామీ దందా.. ఐటీ దాడుల్లో బయట పడ్డ అక్రమాస్థులు !
బెంగళూరు: బెంగళూరులో ఆటో డ్రైవర్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) దాడులు సరికొత్త మలుపు తిరిగింది. ఆటో డ్రైవర్ ను అడ్డం పెట్టుకుని విదేశీ మహిళ భారీగా బినామి ఆస్తులు సంపాదించారని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు.
బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లోని ద్వారకమయి విల్లాలో ఏఫ్రిల్ 16వ తేదీన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ద్వారకమయి విల్లాలో రూ. 7.9 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారులు ద్వారకమయి విల్లాలో దాడులు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆటో డ్రైవర్ సుబ్రమణికి చెందిన విల్లాలో దాడులు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు బినామి ఆస్తులు బదిలి అయ్యాయని కేసు నమోదు చేశారు. ద్వారకమయి విల్లాలో చిక్కిన కోట్ల రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ విషయంలో బెంగళూరుకు చెందిన ఒక బిల్డర్ కు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ద్వారకమయి విల్లాను రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేశారని అధికారులు గుర్తించారు. ఆటో డ్రైవర్ సుబ్రమణికి ద్వారకమయి విల్లాతో పాటు నగరంలో అనేక అక్రమ ఆస్తులు ఉన్నాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
ఆటో డ్రైవర్ సుబ్రమణి పేరుతో విదేశీ మహిళ నగరంలో అనేక అక్రమాస్తులు సంపాధించారని ఐటీ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆటో డ్రైవర్ సుబ్రమణితో విదేశీ మహిళకు ఎలా పరిచయం అయ్యింది ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.
ద్వారకమయి విల్లా కొనుగోలు చెయ్యడానికి ఆటో డ్రైవర్ సుబ్రమణి వెళ్లారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. 2015 నుంచి ద్వారకమయి విల్లా మొదటి అంతస్తులో విదేశీ మహిళ, కింద అంతస్తులో ఆటో డ్రైవర్ సుబ్రమణి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.