పాక్ విద్వేష మంత్రికి భారత్ ఆహ్వానం- 2011 తర్వాత ఇదే తొలిసారి..
చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ కు చెందిన విదేశాంగమంత్రి భారత్ గడ్డపై సుదీర్ఘ విరామం అనంతరం అడుగుపెట్టబోతున్నారు. దాదాపు పుష్కరకాలం క్రితం పాక్ కు చెందిన ఓ విదేశాంగమంత్రి మన దేశంలో పర్యటించగా.. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ప్రస్తుత విదేశాంగమంత్రికి భారత్ ఆహ్వానం పంపింది. వచ్చే నెలలో గోవాలో జరిగే ఎస్సీవో దేశాల విదేశాంగమంత్రుల భేటీకి రావాల్సిందిగా పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి ఆహ్వనం పంపారు.
దీంతో మే 4, 5 తేదీల్లో గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ఇవాళ ప్రకటించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో పాక్ విదేశాంగ మంత్రికి భారతదేశం ఇచ్చిన ఆహ్వానం చాలా కీలకమైందిగా భావిస్తున్నారు ఈ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అలాగే 2011 జూలైలో భారత్కు వచ్చిన చివరి పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాత్రమే.

మన దేశంలో జరిగే సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి హాజరును నిర్ధారిస్తూ... విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొనడం ఎస్సీవో చార్టర్, ప్రక్రియలకు పాకిస్తాన్ నిబద్ధతను, విదేశాంగ విధాన ప్రాధాన్యతలలో ఈ ప్రాంతానికి పాకిస్తాన్ ఇచ్చే ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందన్నారు. ఎస్సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి మే మొదటి వారంలో గోవాకు రావాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ద్వారా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ నుండి ఆహ్వానం పంపారు.
మరోవైపు గతంలో భారత ప్రధాని మోడీపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసిన చరిత్ర బిలావల్ భుట్టోకు ఉంది. గతంలో ఐరాసలో కశ్మీర్ అంశంపై జరిగిన చర్చలో భారత్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన భుట్టో.. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు, కానీ గుజరాత్లోని కసాయి బ్రతుకుతున్నాడు, అతను భారతదేశానికి ప్రధాన మంత్రి అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వీటిని అనాగరిక వ్యాఖ్యలుగా భారత్ రిటార్డ్ ఇచ్చింది. ఇప్పుడు భారత్ కు భుట్టో రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications