కరోనా కట్టడి సక్సెస్: భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: మహారాష్ట్ర వెనక్కి..సౌత్ స్టేట్ టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా రెండోరోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజులుగా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా వాటి సంఖ్య తగ్గడం ఊరటనిస్తోంది. నాలుగైదు రోజులతో పోల్చుకుంటే మరణాల సంఖ్య కూడా తగ్గినట్టే. సోమవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే తాజాగా నమోదైన మరణాలు ఎక్కువే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్డౌన్ను విధించడం, కోవిడ్ ప్రొటోకాల్స్ను కఠినంగా అమలు చేస్తోండటం వంటి చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్టయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు.
రెండోరోజూ భారీగా తగ్గిన కేసులు..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,29,942 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,876 మంది మరణించారు. 3,56,082 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోజువారీ పాజిటివ్ కేసుల కంటే.. డిశ్చార్జీలు అధికంగా నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517కు చేరింది.
ఇందులో 1,90,27,304 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 2,49,992కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 37,15,221గా నమోదైంది. ఇప్పటిదాకా 17,27,10,066 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది.
మరణాల్లో పెరుగుదుల
నాలుగైదు రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలను దాటుతూ వస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు మరణాల సంఖ్య కూడా నాలుగు వేలకు పైమాటే. వాటి తీవ్రత మరింత పెరగొచ్చంటూ భావిస్తోన్న వేళ.. ఒక్కసారిగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్షీణించింది. 3,29,942కు చేరింది. సోమవారం నాటి బులెటిన్ను పరిగణనలోకి తీసుకుంటే- 36,219 కేసులు తగ్గాయి.
ఆది, సోమవారాలతో కలిపి 80 వేల వరకు కేసులు తగ్గినట్టే. మరణాల్లో మాత్రం పెరుగుదల చోటు చేసుకుంది. సోమవారం నాటి బులెటిన్ను పరిగణనలోకి తీసుకుంటే మరణాల సంఖ్య 3,754 నుంచి 3,876కు పెరిగింది.
Recommended Video
కొత్త హాట్స్పాట్గా
ఇదిలావుండగా.. ఇన్నాళ్లూ కరోనా వైరస్కు హాట్స్పాట్గా ఉంటూ వచ్చిన మహారాష్ట్రలో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. సగానికి పైగా రోజువారీ కేసులు తగ్గాయి. ఇన్ని రోజులూ కొత్త కేసుల్లో అగ్రస్థానంలో ఉంటూ వచ్చిన మహారాష్ట్ర.. తాజాగా రెండోస్థాయికి దిగింది.
మహారాష్ట్ర స్థానాన్ని కర్ణాటక భర్తీ చేసింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా కర్ణాటకలో 39,305 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో ఈ సంఖ్య 37,236. తమిళనాడు-28,978, కేరళ-27,487, ఉత్తర ప్రదేశ్-21,277 మేర కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో 35 శాతం మేర నమోదైన కరోనా పాజిటివిటీ రేటు 22కు క్షీణించింది.