ఒక్కరోజులో 4,529 మంది కరోనా కాటుకు బలి: కేసులు తగ్గుతోన్నా: టాప్-5 స్టేట్స్లో ఏపీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. రోజువారీ కరోనా కేసుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల నమోదు కాలేదు. వరుసగా మూడో రోజు కూడా మూడు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల్లో మాత్రం ఏ మాత్రం తీవ్రత తగ్గట్లేదు. ఇంకా స్పీడందుకున్నాయి. మంగళవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే.. కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. మరణాల్లో మాత్రం ఊహించని వేగం కనిపించింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన మరణాల సంఖ్య నాలుగున్నర వేలను దాటేసింది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,67,334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,529 మంది మరణించారు. ఇప్పటిదాకా ఈ స్థాయిలో కరోనా మరణాలు ఎప్పుడూ నమోదు కాలేదు. ఇదే అత్యధికం. డిశ్చార్జీలు కూడా గరిష్ఠస్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజులో 3,89,851 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోజువారీ పాజిటివ్ కేసులతో పోల్చుకుంటే- డిశ్చార్జీలు రెట్టింపయ్యాయి. ఫలితంగా- యాక్టివ్ కేసలు భారీగా తగ్గాయి. 37 లక్షల నుంచి 32 లక్షలకు పడిపోయాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,54,96,330కి చేరింది. ఇందులో 2,19,86,363 మంది కోలుకున్నారు. 2,83,248 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 32,26,719కి చేరింది. గరిష్ఠంగా 38 లక్షలకు చేరువగా వెళ్లిన యాక్టివ్ కేసులు కొద్దిరోజులుగా వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటిదాకా 18,58,09,302 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది.
ఈ మధ్యకాలంలో మూడు లక్షల దిగువకు కరోనా కేసులు నమోదు కావడం ఇదే రెండోసారి. మంగళవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే- వాటి సంఖ్య స్వల్పంగా పెరిగింది. నాలుగున్నర వేలకు పైగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. మూడురోజులుగా కరోనా మరణాల్లో పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. ఏపీ సహా అయిదు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు గరిష్ఠంగా నమోదవుతోన్నాయి. తమిళనాడు-33,059, కేరళ-31,337, కర్ణాటక-30,309, మహారాష్ట్ర-28,438, ఏపీ-21,320 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఈ అయిదు రాష్ట్రాల వాటా 54.05గా ఉంటోంది.
ఇదివరకు 30 వేల వరకు రోజువారీ కేసులు నమోదైన ఢిల్లీలో వాటి సంఖ్య అయిదు వేల దిగువకు చేరింది. నెల రోజుల కిందట ఢిల్లీ లాక్డౌన్లోకి వెళ్లింది. కఠినంగా అమలు చేస్తోంది. ఫలితంగా రోజువారీ కేసులు అయిదువేల కంటే దిగువకు చేరాయి. లాక్డౌన్ను అమలు చేస్తోన్న మహారాష్ట్రలో కూడా ఇదివరకట్లా 60 వేల కేసులు నమోదు కావట్లేదు. వాటి సంఖ్య 30 వేల కంటే దిగువకు చేరింది. కరోనా కట్టడికి దాదాపు అన్ని రాష్ట్రాలు తీసుకుంటోన్న చర్యల వల్ల రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయనే అంచనాలు ఉన్నాయి. మరణాల్లో మాత్రం ఉధృతి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications