ఐరాస విమర్శల్ని తోసిపుచ్చిన భారత్- కశ్మీర్ హత్యలు, పర్వేజ్ అరెస్ట్ వ్యవహారంపై
కశ్మీర్ కు చెందిన హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్ అరెస్ట్ వ్యవహారంతో పాటు కాశ్మీర్లో ఇటీవలి హత్యలపై ఐరాస మానవ హక్కుల కార్యాలయం తప్పుబట్టింది. భారత్ ను ఉద్దేశించి మానవ హక్కుల విభాగం హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారత్ స్పందించింది. దేశ భద్రతా దళాలపై నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు భారత్ అభివర్ణించింది.
కశ్మీర్ లో ఇప్పటికే పెరుగుతున్న హత్యలతో పాటు మానవ హక్కుల కార్యకర్త పర్వేజ్ అరెస్టుపైనా ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేసిన పర్వేజ్ ను వారం రోజులుగా అక్రమంగా నిర్బంధించినట్లు ఆరోపిస్తోంది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఐరాస అధికారి చేసిన ప్రకటన భారత్ లోని భద్రతా దళాల నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు.
యూఏపీఏ చట్టం పార్లమెంటు ఆమోదించిన చట్టమని, దీని ప్రకారం అక్రమ నిర్బంధం అనే మాటే తలెత్తదని బాగ్చి పేర్కొన్నారు. కశ్మీర్ పరిణామాలపై ఐరాస మానవ హక్కుల విభాగం చేసిన విమర్శలపైనా స్పందించిన బాగ్చి... అది ఐరాస అవగాహన లోపానికి నిదర్శనంగా తెలిపారు. ప్రజాస్వామ్య దేశంగా, దాని పౌరుల మానవ హక్కులను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి కట్టుబడి ఉన్న నిబద్ధతతో, భారతదేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని బాగ్చి తెలిపారు.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి, పౌరుల భద్రతను నిర్ధారించడానికి UAPA వంటి జాతీయ భద్రతా చట్టాలు పార్లమెంటుచే రూపొందించబడ్డాయని, పర్వేజ్ను అరెస్టు చేయడం, తదుపరి నిర్బంధం పూర్తిగా చట్ట నిబంధనల ప్రకారం జరిగిందని కేంద్రం పేర్కొంది. భారతదేశంలోని అధికారులు చట్ట ఉల్లంఘనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారని తెలిపింది. హక్కులను చట్టబద్ధంగా అమలు చేయడానికి వ్యతిరేకంగా మాత్రం వ్యవహరించబోరని వెల్లడించింది. అటువంటి చర్యలన్నీ ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉంటాయని కేంద్రం తెలిపింది. మానవ హక్కులపై ఉగ్రవాదం యొక్క ప్రతికూల ప్రభావం గురించి అవగాహన పెంచుకోవాలని ఐరాస మానవ హక్కుల విభాగానికి సూచించింది.