దేశవ్యాప్తంగా 5వేల పైచిలుకు బ్లాక్ ఫంగస్ కేసులు-కోవిడ్ నుంచి కోలుకున్నవారికే-ఏపీకి 2వేల అంఫోటెరిసిన్-బి వయల్స్
ఓవైపు కరోనా వైరస్... మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యుకర్మైకొసిస్).. ఇవి చాలవన్నట్లు వైట్ ఫంగస్,యెల్లో ఫంగస్... ఇలా వ్యాధులన్నీ మనుషులపై ముప్పేట దాడి చేస్తున్నాయి. భారత్లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో ఆరోగ్య సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. ఇప్పటివరకూ కరోనా పైనే పోరాడుతూ వస్తున్న దేశం... ఇకపై బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్,యెల్లో ఫంగస్ లాంటి వ్యాధులపై కూడా పోరాడక తప్పదు. కరోనా చికిత్సలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఉపయోగించడమే బ్లాక్ ఫంగస్ కేసులకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ దేశంలో నమోదైన బ్లాక్ ఫంగస్ కేసులపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
దడ పుట్టిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... మధ్యప్రదేశ్లో బయటపడ్డ 50 కేసులు... అప్రమత్తంగా ఉండాలన్న సీఎం...
తెలంగాణలోనూ 'బ్లాక్ ఫంగస్' కలకలం... భైంసాలో బయటపడ్డ 3 కేసులు... ఒకరి మృతి
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఎన్ని బ్లాక్ ఫంగస్ కేసులు...
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 18 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో 5424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ఇందులో చాలామంది కరోనా బారినపడినవారే అని... 55 శాతం మంది డయాబెటీస్తో కూడా బాధపడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనా.. లేదా అనుమానిత కేసులను గుర్తించినా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు బ్లాక్ ఫంగస్కు సంబంధించిన మార్గదర్శకాలను లేఖ రూపంలో పంపించింది.
రాష్ట్రాలు,కేంద్రాలకు మార్గదర్శకాలు...
అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులు,మెడికల్ కాలేజీల్లో బ్లాక్ ఫంగస్కు సంబంధించి కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ లేఖలో పేర్కొంది. వ్యాధిని గుర్తించడం,పరీక్షలు చేయడం,చికిత్స విషయంలో కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడం,చాలామందిలో మరణం సంభవిస్తుండటంతో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నిజానికి దేశంలో మొత్తం 8848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు కథనాలు వచ్చాయి. అయితే కేంద్రం మాత్రం 5424 కేసులే ఉన్నట్లు అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
రాష్ట్రాలకు అంఫోటెరిసిన్-బి...
బ్లాక్ ఫంగస్ కేసుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనంగా మరో 23,680 అంఫోటెరిసిన్-బి వయల్స్ను సప్లై చేస్తున్నట్లు కేంద్ర ఎరువులు,రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ కీలకం కావడంతో రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. తాజాగా కేటాయించిన అదనపు వయల్స్ను గుజరాత్కు 5800,మహారాష్ట్రకు 5090,ఆంధ్రప్రదేశ్కు 2310,మధ్యప్రదేశ్కు 1830,రాజస్తాన్కు 1780,కర్ణాటకకు 1270 కేటాయించారు.
బ్లాక్ ఫంగస్కు కారకాలు...
బ్లాక్ ఫంగస్ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంది. అయితే సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఈ వ్యాధి సోకినవారిలో కళ్లు ఎర్రబడటం,ముఖం ఒకవైపు వాపు రావడం,చర్మం చిట్లిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటి చుట్టూ కండరం బిగుసుకుపోయి అంధత్వానికి దారితీయవచ్చు. ఫంగస్ ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి మెదడుకు చేరితే మరణం సంభవిస్తుంది. కరోనా నుంచి కోలుకున్నవారిలోనే ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా చికిత్స కోసం అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి... బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే రిస్క్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అవసరమైతే తప్ప కోవిడ్ పేషెంట్లకు స్టెరాయిడ్స్ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ను నోటిఫైయబుల్ డిసీజ్గా గుర్తించాయి.