కరోనా బీభత్సం: అరకోటికి చేరువగా కేసులు: 80 వేలను దాటిన మరణాలు: మరింత దూకుడుగా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. జనాన్ని బేజారెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అరకోటికి చేరువ అయ్యాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక్కరోజులో 50 లక్షల మార్క్ను దాటుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే స్థాయిలో మరణాల సంఖ్యా నమోదవుతోంది. ఇప్పటిదాకా 80 వేల మందికి పైగా కరోనా కాటుకు బలి అయ్యారు. అర్ధాంతరంగా తనువు చాలించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప.. కరోనా నియంత్రణపై ఆశల్లేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. పాలకుల తీరూ అలాగే ఉంటోంది.
తెలంగాణలో ఎన్ని టెస్టులు చేస్తే.. అన్ని కరోనా కేసులు: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జిల్లోనూ
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 83,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,054 మంది మరణించారు. ఇదివరకు నమోదైన గణాంకాలతో పోల్చుకుంటే.. ఈ రెండింటి సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపించింది. ఇదివరకు రోజువారీ కరోనా కేసులు 90 వేలకు పైగా నమోదు అయ్యేవి. ఈ సారి ఆ సంఖ్య 84 వేలకు క్షీణించింది. కరోనా మరణాలు 1100లకు పైగా నమోదువుతూ వచ్చాయి. చాలాకాలం తరువాత ఈ మార్క్కు దిగువగా రోజువారీ మరణాలు నమోదు అయ్యాయి.
ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 49,30,237కు చేరుకుంది. ఇప్పటిదాకా 80,776 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 9,90,061కి చేరుకుంది. 38,59,400 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకొక్క రోజులో అటు రోజువారీ కేసులు అరకోటికి, ఇటు యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్క్ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు.
కరోనా వైరస్ కేసుల్లో ఈ స్థాయిలో పెరుగుదల మరే దేశంలోనూ నమోదు కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన అమెరికాలోనూ ఈ స్పీడ్ లేదు. గరిష్ఠంగా 70 వేల లోపే అమెరికాలో రోజువారీ కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్లో మాత్రం అత్యధికంగా 97 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అన్లాక్-4 తరువాత రోజువారీ కేసుల్లో ఉధృతి తీవ్రమైంది. రోజూ వెయ్యికి తగ్గకుండా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కాటుకు దేశంలో 80 వేల మందికి పైగా ప్రజలు బలి అయ్యారంటే మాటలు కాదు.
దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. సోమవారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య క్రమంగా ఆరు కోట్లకు చేరుకుంటోంది. ఇప్పటిదాకా 5,83,12,273 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజులో 10,72,845 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, తమిళనాడుల్లో కరోనా వైరస్ టెస్టులు జోరుగా కొనసాగుతున్నాయి.
Recommended Video