బుల్లెట్ రైలు, 500 కిలో మీటర్ల గమ్యం: రెండు గంటలే
న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్ రైలు సంచరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, 2023 నాటికి పట్టాలెక్కుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. భారత రైల్వే శాఖలో ఇది మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ముంబై- అహమ్మదాబాద్ మధ్య అండర్ సీ టన్నెల్ లో బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందని అన్నారు. దీని గరిష్ట వేగం 350 కిలో మీటర్లు కాగా (గంటకు), నిర్వహణా వేగాన్ని 320 కిలో మీటర్లకు తగ్గించామని వివరించారు. ఈ బుల్లెట్ రైలు ద్వారా ముంబై- అహమ్మదాబాద్ మధ్యలో 508 కిలో మీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.
నిర్మాణ పనులు 2018లో మొదలయ్యే అవకాశం ఉందని, రూ. 97,636 కోట్లతో ఆ ప్రాజెక్టును పట్టాలక్కించనున్నామని అన్నారు. ఇందులో 81 శాతం నిధులు జపాన్ నుంచి తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వివరించారు. ఈ మొత్తాన్ని 0.1 శాతం వార్షిక వడ్డీతో 50 సంవత్సరాల్లో తిరిగి చెల్లిస్తామని తెలిపారు.