రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్కు బిగ్ షాక్!
ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ మధ్యలో ఓ చిక్కులో పడ్డారు. డ్రెస్సింగ్ రూమ్లో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు దొరికిపోవడంతో బీసీసీఐ రియాన్ పరాగ్కు భారీ జరిమానా విధించింది. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు రియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా ఓ డీమెరిట్ పాయింట్ను కూడా కేటాయించింది.
సాధారణంగా ఇలాంటి జరిమానాలు ఆటగాడి జేబుకు చిల్లు పెడతాయని అందరూ భావిస్తారు. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఈ 25 శాతం జరిమానాను రియాన్ పరాగ్ స్వయంగా చెల్లించాల్సిన అవసరం లేదని సమాచారం. ఐపీఎల్లోని దాదాపు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లపై పడే ఆర్థిక భారాన్ని తామే భరిస్తాయి. రియాన్ పరాగ్ ఓ మ్యాచ్ ఫీజు సుమారు రూ.1 కోటి వరకు ఉంటుంది కాబట్టి, 25 శాతం అంటే దాదాపు రూ. 25 లక్షల జరిమానాను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యమే చెల్లించనుంది. ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఫ్రాంచైజీలు ఈ విధానాన్ని అనుసరిస్తాయి.

అయినప్పటికీ ఈ వ్యవహారం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. వేపింగ్ లేదా ఈ-సిగరెట్ల వాడకం భారత చట్టం (ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం 2019) ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కేవలం ఆటగాడిపైనే కాకుండా, మొత్తం జట్టుపై, అధికారులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తోంది. ఐపీఎల్ ఆర్టికల్ 2.21 ప్రకారం క్రీడా ప్రతిష్టకు భంగం కలిగించే పనులను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే తన మేనేజర్ రోమీ భిందర్ ఫోన్ వాడకం వల్ల జరిమానా ఎదుర్కోగా.. ఇప్పుడు కెప్టెన్ చేసిన పని జట్టు పరువును ప్రశ్నార్థకం చేస్తోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్ రేసులో బలంగా దూసుకుపోతోంది. మైదానంలో రియాన్ పరాగ్ నాయకత్వంలో జట్టు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. మైదానం వెలుపల జరుగుతున్న ఇటువంటి సంఘటనలు ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారాయి. బీసీసీఐ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తే రాజస్థాన్ రాయల్స్కు మరిన్ని ఆంక్షలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. చట్టబద్ధమైన, క్రీడాపరమైన నిబంధనల మధ్య ఈ వివాదం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.












Click it and Unblock the Notifications