చైనా కంటే పవర్ఫుల్గా భారత్ - ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆకాంక్ష - అసలు నిజం భగవత్కు తెలుసన్న రాహుల్
శక్తి పరంగా, విస్తీర్ణం పరంగా భారతదేశం చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆకాంక్షించారు. అదే సమయంలో ఆక్రమణలకు పాల్పడుతోన్న చైనాపై ఆయన నిప్పులు చెరిగారు. విజయదశమి సందర్భంగా నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి కరసేవకులను ఉద్దేశించి ఆయన వార్షిక ప్రసంగం చేశారు. కాగా, చైనాపై భగవత్ కామెంట్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు.

చైనాకు వణుకు..
ప్రస్తుత పాలకుల్లో స్వాభిమానం, సైనికుల్లో దేశభక్తి, అకుంఠిత దీక్షలు ఉన్నతమైనవని భగవత్ కీర్తించారు. భారత సరిహద్దులో చైనా అతిక్రమణలకు పాల్పడుతోన్న విషయం ప్రపంచానికంతటికీ తెలుసని, భారత్ తోపాటు తైవాన్, అమెరికా, జపాన్ లతోనూ చైనా గొడవలకు దిగుతున్నదని, అయితే అందరిలోకి భారత్ ధీటుగా సమాధానమివ్వడంతో చైనాకు వణుకుపుడుతున్నదని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు.

యుద్ధ సన్నద్ధత..
భారత్, చైనా సరిహద్దు వెంబడి మే మొదటి వారం నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, చలికాలంలోనూ యుద్ధం చేసేందుకు వీలుగా ఇరు దేశాలూ సమాయత్తం అవుతోన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక సూచనలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా భారత్ సైన్యాన్ని బలోపేతం చేసి సిద్ధంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల తర్వాత ప్రపంచమంతా చైనాకు వ్యతిరేకంగా నిలబడుతోందని గుర్తుచేశారు. స్నేహ భావాన్ని బలహీనతగా భావించి దాడులు చేసే చైనా లాంటి దేశాలకు తగిని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

భగవత్, బీజేపీకి నిజం తెలుసు..
తన విజయదశమి సందేశంలో చైనాను ఉద్దేశించి పలు కామెంట్లు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. భారత భూభాగాన్ని ఆక్రమించి, భారత సైనికులను చంపేసిన తర్వాత కూడా చైనా దురాగతాన్ని మోదీ సర్కార్ తప్పుపట్టకపోవడంపై ఇప్పటికే పలు మార్లు విమర్శించిన రాహుల్.. తాజగా.. ‘‘సరిహద్దులో చైనా ఆక్రమణలపై భగవత్ కు నిజాలు తెలుసు. కానీ ఆ నిజాన్ని ఎదుర్కోవడానికి ఆయనగానీ, మోదీ సర్కార్ గానీ సిద్ధంగా లేరు'' అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications