బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతం: టార్గెట్ 400 కి.మీలు
న్యూఢిల్లీ: విస్తరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ను భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలదు.
Recommended Video
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పీజే-10 ప్రాజెక్టులో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించారు. ఈ క్షిపణిని దేశీయ బూస్టర్తో ప్రయోగించడం గమనార్హం. విస్తరించబడిన తర్వాత ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ను పరీక్షించడం ఇది రెండోసారి.
భారతదేశం, రష్యా మధ్య జాయింట్ వెంచర్లో భాగంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణిని మొదట 290 కిలోమీటర్ల పరిధితో రూపొందించారు. అయినప్పటికీ, సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, క్షిపణి పరిధిని 400 కిలోమీటర్లకు విస్తరించింది.
కాగా, కొన్ని అంచనాల ప్రకారం, సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి 450 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేరుకోగలదు. విస్తరించిన శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి మొదటి పరీక్షను మార్చి 2017 లో నిర్వహించారు.
ఒడిశాలోని ప్రయోగ కేంద్రం నుంచి టెస్ట్ ఫైర్ చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భూమి మీద నుంచి ప్రయోగించవచ్చు. అదేవిధంగా, సబ్ మెరైన్ల నుంచి, యుద్ధ నౌకల నుంచి, ఫైటర్ జెట్ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని రష్యాకు చెందిన ఫెడరల్ స్టేట్ యూనిటరీ ఎంటర్ప్రైజ్ ఎన్పీవో మషినో స్ట్రోనియలతో కలిసి డీఆర్డీఓ సంయుక్తంగా నిర్మించింది. విస్తరించబడిన ఈ క్షిపణి పరిధిలోకి చైనాలోని కీలక నగరాలు కూడా వస్తుండటం గమనార్హం.