అగౌరవపర్చడమా?: కర్తార్పూర్ సాహిబ్ వద్ద మోడల్ ఫొటోషూట్ ఘటనపై పాకిస్థాన్కు భారత్ సమన్లు
న్యూఢిల్లీ: కర్తార్పూర్ సాహిబ్లో దుస్తుల బ్రాండ్తో సంబంధం ఉన్న పాకిస్థానీ మోడల్ సంఘటనపై "తీవ్ర ఆందోళన" తెలియజేయడానికి దేశంలోని రెండవ సీనియర్-మోస్ట్ దౌత్యవేత్తకు భారతదేశం మంగళవారం సమన్లు పంపింది.
భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజం మనోభావాలను ఈ దుర్మార్గపు సంఘటన తీవ్రంగా గాయపరిచిందని పాకిస్తాన్ ఛార్జ్ డి'ఎఫైర్స్కు భారతదేశం తెలియజేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి,అరిందమ్ బాగ్చి ఒక ప్రకటనలోవెల్లడించారు.
'పాకిస్తాన్లోని మైనారిటీ వర్గాల మతపరమైన ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేయడం, అగౌరవపరచడం వంటి సంఘటనలు ఈ వర్గాల విశ్వాసం పట్ల గౌరవం లేకపోవడాన్ని ఎత్తి చూపుతున్నాయి' అని భారత విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ విషయంపై చిత్తశుద్ధితో విచారణ జరిపి ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు పాక్ దౌత్యవేత్తకు భారత్ తెలియజేసిందని కూడా పేర్కొంది.
కాగా, సిక్కులకు పవిత్ర క్షేత్రమైన కర్తార్పూర్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాలో పాకిస్థాన్ మోడల్ సౌలేహ ఇంతియాజ్ సోమవారం ఫొటోలు దిగారు. ఆమె ఫొటోలను మన్నత్ క్లాటింగ్ అనే వస్త్రవ్యాపార సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆమె తలపై వస్త్రం ధరించకుండా ఫొటోలు దిగడం వివాదాస్పదంగా మారింది. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు.
శిరోమణి అకాలీదళ్ ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా కూడా ఆమె ఫొటోలను షేర్ చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన ఆమోద యోగ్యం కాదని, ఆమె వారి మత సంబంధ పవిత్రస్థలాల వద్ద ఇలా చేయగలదా? అని ప్రశ్నించారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, తన ఫొటోలు వివాదాస్పదం కావడంతో మోడల్ సౌలేహ ఇంతియాజ్ క్షమాపణలు చెప్పారు. ఎవరినీ బాధపెట్టాలని ఇలా చేయలేదని, కర్తార్పూర్ గురుద్వారాను సందర్శించిన సందర్భంగా ఫొటోలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి పనులు భవిష్యత్తులో చేయబోనని అన్నారు. ఇక ఆ ఫొటోలను పోస్టు చేసిన మన్నత్ క్లాతింగ్ సంస్థ కూడా క్షమాపణలు చెప్పింది. మరోవైపు, ఈ వివాదంపై పాక్ పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం స్పందించింది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.