ఒపీనియన్ పోల్: రజనీకాంత్ 'తమిళ్' షాక్, అంత సీన్లేని బీజేపీ, రజనీ షాకింగ్ నిర్ణయం!
చెన్నై: రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం ప్రకటన నేపథ్యంలో ఇండియా టుడే - కార్వీ సంస్థ సంయుక్తంగా ఓ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ ఓపీనీయన్ పోల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అన్నాడీఎంకే నుంచి 20 శాతం మంది తాము రజనీకాంత్కు ఓటు వేస్తామని చెప్పారు.
సర్వే ప్రకారం అన్నాడీఎంకేకు చెందిన 20 శాతం మంది, డీఎంకెకు చెందిన 16 శాతం మంది ఓటర్లు రజనీకాంత్ పార్టీకి ఓటు వేస్తామని వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే రజనీకాంత్ పార్టీ 33 సీట్లు కైవసం చేసుకోగలదని సర్వేలో తేలింది.
కమల్తో రజనీ పొత్తు వద్దని, అన్నాడీఎంకేకు నష్టం
ముఖ్యమంత్రిగా రజనీకాంత్ ఉండాలని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు. టాప్ సీటు రేసులో రజనీకాంత్ రెండో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉండగా, కమల్ హాసన్ పార్టీతో పొత్తు ఉండకపోవడమే మంచిదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ ఆరంగేట్రం ఎక్కువగా అన్నాడీఎంకేకే నష్టమని ఈ సర్వేలో తేలింది. కాగా, అన్నాడీఎంకే కలువకపోవచ్చునని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది రజనీకి లాభిస్తుందని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఆశలు గల్లంతు
ఇక, తమిళనాడులో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తున్న బీజేపీకి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని తాజా ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాల ద్వారా వెల్లడైంది. ఇప్పుడు ఎన్నికలు వస్తే 234 సీట్లకు గాను రజనీకాంత్ పార్టీ 33 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. బీజేపీ, రజనీకాంత్ ఆలోచనలు ఆదర్శంగా, ఒకేలా ఉంటాయని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నారు.
రజనీకాంత్-నాన్ తమిళ్
తమిళనాట ఉన్న రాజకీయ శూన్యతను రజనీకాంత్ భర్తీ చేస్తారా అంటే 40 శాతం మంది అవునని, 51 శాతం మంది కాదని, 9 శాతం మంది చెప్పలేమని ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. అంతేకాదు, నాన్ తమిళ్ అనే అంశం రజనీకాంత్ను కౌంటర్ చేసే వాళ్లకు ఉపయోగపడుతుందని సర్వేలో తేలింది.
డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని
ఇప్పుడు ఎన్నికలు వస్తే డీఎంకే గెలుస్తుందని, ఆ పార్టీ 130 సీట్లు సాధిస్తుందని తేలింది. అన్నాడీఎంకేలో విభేదాలు, రజనీకాంత్ పార్టీతో అన్నాడీఎంకేకు దెబ్బ తదితర కారణాలతో డీఎంకే గెలుస్తుందని తేలింది.
రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం
రజనీకాంత్ 2.0, కాలా చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలే ఆయన చివరి చిత్రాలు అంటూ తాజాగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన రాజకీయాలపై దృష్టి పెడతారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధం కావాల్సి ఉంది. త్వరలో పార్టీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, జూన్లలో విడుదలయ్యే పై రెండు సినిమాలే చివరివి అవుతాయని అంటున్నారు.