తాలిబన్ల చెర నుండి విడుదల: మోడీవల్లే బయటపడ్డానని క్రైస్తవ ఫాదర్
న్యూఢిల్లీ: సుమారు ఎనిమిది నెలల క్రితం ఆప్ఘనిస్తాన్లో అపహరణకు గురైన భారత్కు చెందిన క్రైస్తవ మతగురువు ఫాదర్ అలెక్సిస్ ప్రేమ్ కుమార్ విడుదలయ్యాడు. సాధ్యమైనంత త్వరలో అతనిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అలెక్సిస్ ప్రేమ్ కుమార్తో మాట్లాడానని, కుటుంబ సభ్యులకు సమాచారం అందిందని, వారంతో సంతోషంగా ఉన్నారని మోడీ పేర్కొన్నారు. అలెక్సిస్ ప్రేమ్ కుమార్ (47)ను గత జూన్ రెండో తేదీన ఆప్ఘనిస్తాన్లోని హేరట్లో గుర్తు తెలియని సాయుధులు అపహరించుకు వెళ్లారు.
తొమ్మిది నెలలుగా వారి బందీలోనే ఉన్నాడు. శరణార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ఒక స్వచ్చంధ సంస్థ తరఫున ఆయన కొన్నేళ్ల నుండి అక్కడే పని చేస్తున్నారు. హేరట్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహాదత్ గ్రామంలో శరణార్థుల కోసం నిర్వహిస్తున్న ఓ పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన సమయంలో అతనిని అపహరించారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. జెసూట్ రెఫ్యూజీ సర్వీస్ అనే స్వచ్చంధ సంస్థ ప్రతినిధిగా ఉన్నాడు.
ప్రధాని మోడీయే కాపాడారు: అలెక్సిస్ ప్రేమ్ కుమార్
నెలలుగా తాలిబన్ల చేతిలో బందీగా ఉన్న తనను, వారి చెర నుండి ప్రధాని నరేంద్ర మోడీయే కాపాడారని ప్రేమ్ కుమార్ అలెక్సిస్ అన్నారు. ప్రధాని మోడీ చొరవతో తనకు విముక్తి లభించిందన్నాడు. తన విడుదలకు కృషి చేసిన మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మోడీ లేకుంటే తన ప్రాణాలు పోయి ఉండేవన్నారు. ఆయన తాలిబన్ల చెర నుండి బయటపడి కాబూల్ విమానాశ్రయానికి చేరిన తర్వాత మోడీ స్వయంగా మాట్లాడారని చెప్పాడు.
త్వరలోనే భార్య పిల్లలతో కలిసి ఆయనను కలుస్తానని చెప్పాడు. తాను ఇలా బతికి వచ్చానంటే ప్రధాని మోడీయే కారణమని, ఆయన తన విడుదలకు ఎంతో శ్రద్ధ తీసుకున్నారని చెప్పాడు. కాగా, అంతకుముందు ప్రధాని ట్వీట్ చేస్తూ.. క్రైస్తవులను ఎలాంటి సమస్యల నుంచైనా రక్షించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నాడు. ప్రేమ్ కుమార్ విడుదల కావడంతో మోడీ కూడా ఆనందించారు.