Indian railways: రైళ్ళలో దుప్పట్లు ఎన్నాళ్ళకోసారి ఉతుకుతారో తెలిస్తే షాక్!
భారతీయ రైల్వేలు ప్రయాణికుల భద్రతకు రైళ్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తాయని అనేక సందర్భాలలో చెప్పుకున్నాం అయితే ఇటీవల ఓ మీడియా సంస్థ ఆర్టిఐ ద్వారా సేకరించిన ఒక సమాచారం రైల్వే ప్రయాణికులను షాక్ కు గురిచేస్తుంది. రైళ్లలో స్లీపర్ కోచ్, ఏసీ కోచ్ లలో ప్రయాణికులకు ఇచ్చే బెడ్ షీట్లను ఒకసారి వినియోగం తర్వాత తిరిగి ఉతకడానికి పంపిస్తుంది రైల్వే.
అదే రైళ్లలో ఇచ్చే ఉన్ని దుప్పట్లను నెలకు ఒకసారి గరిష్టంగా నెలకు రెండు సార్లు మాత్రమే వాష్ చేస్తుందన్న సమాచారం అందర్నీ ఒకసారిగా షాక్ గురిచేస్తుంది. వివిధ సుదూర రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు రైళ్లలో ఇచ్చే దుప్పట్లు ఎప్పటికప్పుడు ఉతికినవని భావిస్తారు అయితే దుప్పట్ల విషయంలో ప్రయాణికులు కంప్లైంట్ చేస్తే, ఏదైనా దుర్వాసన వస్తున్నట్టు గుర్తిస్తే మాత్రమే వాటిని ఉతుకుతున్నట్లుగా సమాచారం.

రైలు చార్జీలతో పాటు బెడ్ షీట్, దుప్పట్ల సేవలకు చార్జీ
సుదూర రైళ్లలో ఉండే 20 హౌస్ కీపింగ్ సిబ్బంది ఈ విషయాన్ని తెలిపినట్టు సదరు మీడియా సంస్థ వెల్లడించింది. ఏసీ కోచ్ లలో అందించే దుప్పట్లు, బెడ్ షీట్లు, పిల్లోల సేవల కోసం ప్రయాణికుల నుండి చార్జి వసూలు చేస్తారా అని ఆర్.టి.ఐ ప్రశ్నకు భారతీయ రైల్వే స్పందిస్తూ రైలు చార్జీలలో ఈ సేవల చార్జీలు చేర్చబడతాయని పేర్కొంది.
బెడ్ షీట్ లు, దిండు కవర్లు ఎప్పటివప్పుడే వాష్
గరీబ్ రథ్, దురంతో వంటి కొన్ని రైళ్లలో ప్రయాణికులు అదనపు రుసుముతో బెడ్ రోల్ కిట్ ను కొనుగోలు చేయవచ్చునని రైల్వే మంత్రిత్వ శాఖలోని ఎన్విరాన్మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్ సెక్షన్ ఆఫీసర్ రిషు గుప్తా తెలిపారు. దురంతో వంటి రైళ్ల నుండి హౌస్ కీపింగ్ సిబ్బంది ప్రామాణిక శుభ్రపరిచే పద్ధతులను కూడా వెల్లడించారు. ప్రతి ట్రిప్పు తర్వాత బెడ్ షీట్లు, దిండు కవర్లు లాండ్రీకి పంపబడతాయని తెలిపారు.

దుప్పట్ల విషయంలో ఏం చేస్తారంటే
దుప్పట్లు మాత్రం మడతపెట్టి కోచ్ లోనే నిల్వ చేయబడతాయని తెలిపారు.ఇక దుప్పట్ల విషయంలో దుర్వాసన వస్తే, మురికిగా ఉంటే మాత్రమే ఉతకడం జరుగుతుందని తెలిపారు. లేదా ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే వాటిని ఉతికేందుకు పంపుతారని పేర్కొన్నారు. భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా 46 డిపార్ట్మెంటల్ లాండ్రీలు మరియు 25బూట్ లాండ్రీలను నిర్వహిస్తున్నాయని ఆర్టిఐ ద్వారా పేర్కొన్నారు.
గతంలో కాగ్ అక్షింతలు... అయినా మారని తీరు
ఇదిలా ఉంటే 2017లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలో కూడా భారతీయ రైల్వేలో దుప్పట్ల శుభ్రత నిర్వహణకు సంబంధించి విమర్శించడం చోటుచేసుకుంది. రైల్వేలో దుప్పట్లను ఉతకడం, పారిశుధ్యాన్ని నిర్వహించడం రైల్వే ప్రమాణాల ప్రకారం జరగడం లేదని పేర్కొంది. ఇక తాజాగా మరో మరు ఆర్టిఐ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం రైల్వే ప్రయాణికులను షాక్ కు గురి చేసింది.












Click it and Unblock the Notifications