#IndiaSupportsCAA:క్లారిటీ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్,ఆ వెంటనే ట్రెండింగ్లోకి..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అవగాహన కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రచారం ప్రారంభించారు. #IndiaSupportsCAA అనే హ్యాష్ట్యాగ్తో ప్రధాని నరేంద్ర మోడీ సీఏఏకు సంబంధించిన ఒక ట్వీట్ చేశారు. సీఏఏకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని, మద్దతివ్వాలని కోరారు.
ఇండియా సపోర్ట్స్ సీఏఏ..
సీఏఏను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. భారతదేశం సీఏఏకు మద్దతు పలుకుతుంది. ఎందుకంటే మతపరమైన వివక్షకు, హింసకు గురై మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన వారికి మనదేశ పౌరసత్వం ఇచ్చేందుకు మాత్రమే సీఏఏను తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.
ఎవరి పౌరసత్వం తొలగించబడదు..
సీఏఏ ద్వారా దేశంలోని ఎవరి పౌరసత్వం తొలగించబడదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేగాక, ఇండియాసపోర్ట్స్ సీఏఏ హ్యాష్ట్యాగ్తో మీ మాటలు చెప్పాలని కోరారు. నమో యాప్ ద్వారా కంటెంట్, గ్రాఫిక్స్, వీడియోలు తదితర సమాచారం పొందవచ్చని, వాటిని షేర్ చేసి సీఏఏకు మీ మద్దతు తెలపాలని ప్రజలను ప్రధాని మోడీ కోరారు.
ట్రెండింగ్.. #IndiaSupportsCAA
ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా #IndiaSupportsCAA అనే హ్యాష్ట్యాగ్తో ట్వీట్లు చేయడంతో ఇప్పుడు ట్విట్టర్లో ఈ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. చాలా మంది సీఏఏకు మద్దతు పలుకుతున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మత హింసను, వివక్షను ఎదుర్కొని మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకే సీఏఏను కేంద్రం తీసుకొచ్చింది.
ఆందోళనల్లో 26మంది మృతి..
కాగా, పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్, అస్సాం, న్యూఢిల్లీల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ బీహార్ రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేయబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తాము ఎన్ఆర్సీని అమలు చేయబోమని తేల్చి చెప్పాయి.