ఇండిగో కరోనా ఆఫర్: ఒక ప్రయాణికుడు రెండు సీట్లు బుక్ చేసుకోవచ్చు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటించాలనుకునే ప్రయాణికుడు రెండు సీట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. జులై 24 నుంచి ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.
ఇండిగో వెబ్సైట్లు టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే '6ఈ డబుల్ సీట్' పేరిట తీసుకొస్తున్న ఈ స్కీమ్ వర్తిస్తుందని వెల్లడించింది. అదనపు సీటుకు వాస్తవ ధర కంటే 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో తెలిపింది.
ఇటీవల విమాన ప్రయాణంపై నిర్వహించిన ఓ సర్వేలో భౌతిక దూరం పట్ల పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇండిగో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ప్రయాణానికి 24 గంటల ముందు కూడా డబుల్ సీటును బుక్ చేసుకోవచ్చని ఇండిగో సంస్థ తెలిపింది. ప్రయాణికుడి ఆనుకుని ఉన్న సీటును మాత్రమే బుక్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇది ఇలావుండగా, కేంద్ర ప్రభుత్వం మూడు దేశాలకు అంతర్జాతీయ విమానాలను నడపనున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాలతో చర్చలు జరిపామని కేంద్రమంత్రి తెలిపారు. శుక్రవారం అమెరికా నుంచి శనివారం ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు.
జులై 17 నుంచి జులై 31 వరకు భారత్-అమెరికా దేశాల మధ్య 18 యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాలు నడుస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు ప్యారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య ఎయిర్ఫ్రాన్స్ 28 విమానాలను నడపనుందని వెల్లడించారు. జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని తెలిపారు.
అంతేగాక, లుఫ్తాన్సా ఎయిర్లైన్స్తో ఒప్పందం కొలిక్కివచ్చిందని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. విదేశీ విమాన సర్వీసులపై ఈ నిర్ణయంలో పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.