కోర్టులో రాయిలా ఇంద్రాణి: ఏడ్చేసిన కూతురు
ముంబై: కూతురు షీనా బొరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖార్జియాను పోలీసులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంద్రాణిని కస్టడీలో పోలీసులు భౌతికపరమైన హింసకు గురి చేశారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. అదే విషయాన్ని ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు కూడా చెప్పినట్లు సమాచారం.
ఇంద్రాణిని పోలీసులు 80 నుంచి 90 గంటల పాటు విచారించారని, న్యాయపరమైన కౌన్సెలింగ్కు కూడా అవకాశం ఇవ్వలేదని లాయర్లు చెప్పారు. కాగా, కోర్టులో ఇంద్రాణి నిశ్చలంగా రాయిలా ఉండిపోగా, ఆమె కూతురు విధి మాత్రమే ఏడ్చేసింది.
విధి సోమవారం కోర్టుకు వచ్చారు. కాగా, కుమారుడు మిఖాయిల్ బోరాను హత్య చేయడానికి ఇంద్రాణి ముఖార్జియా కాంట్రాక్ట్ కిల్లర్ను సంప్రదించిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షీనాను 2012లో హత్య చేసిన సమయంలోనే మిఖాయిల్ బోరాను కూడా అంతమొందించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
తన పిల్లలు షీనా బొరా, మిఖాయిల్ బొరాలను ఇంద్రాణి అందరికీ తన సోదరిగా, సోదరుడిగా పరిచయం చేసింది. షీనా బొరా హత్య కేసులో ఇంద్రాణితో పాటు పోలీసులు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, డ్రైవర్ శ్యామ్ను అరెస్టు చేశారు.