ఆరేళ్ల కొడుకుపై తాగుబోతు తండ్రి అమానుషం.. కత్తితో పొడిచి..
తాగి ఇంటికొచ్చాక భార్య వాగ్వాదానికి దిగిన భర్త.. ఆ కోపంలో కొడుకుపై కత్తితో దాడి చేశాడు.
బుర్ద్వాన్: ఆరేళ్ల కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన పశ్చిమ బంగాలోని బుర్ద్వాన్ లో ఆదివారం నాడు చోటు చేసుకుంది. తాగిన మత్తులో అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కొడుకును పొడిచిన తర్వాత తనను తాను ఆ తండ్రి గాయపరుచుకోవడం గమనార్హం.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పిక్నిక్ కోసమని స్నేహితులతో కలిసి బయటకెళ్లిన మాఝీ తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్యతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో ఆరేళ్ల కొడుకు కృష్ణ గోపాల్ ను మాఝీ కత్తితో గాయపరిచాడు.
కొడుకును గాయపరిచిన తర్వాత తనను తానే కత్తితో గాయపరుచుకున్నాడు. భర్త దుశ్చర్యకు భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా ఆ ఇంటికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే మెడ వద్ద చాలా లోతుగా గాయం కావడంతో కృష్ణ గోపాల్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
తాగి ఇంటికొచ్చిన మాఝీ.. భార్యతో గొడవపడి ఆ కోపాన్నంతా కొడుకు మీద చూపించాడని స్థానికులు చెబుతున్నారు.