శిశువుల్ని ఉల్లిగడ్డల్లా అమ్మేస్తున్నారు: కోర్టు ఆగ్రహం
భారత శిక్షాస్మృతి కింద వీరిని నేరస్థులుగా పరిగణించి శిక్షించేందుకు చట్టసవరణ చేయాలని అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని లావ్ శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా సూచించారు. చాలా దేశాల్లో పిల్లల అమ్మకాలు, కొనుగోళ్లను నేరమని, అయితే దత్తత ముసుగులో ఈ వ్యవహారం నిరాటంకంగా సాగిపోతోందని ఆమె తెలిపారు. 21 ఏళ్ల క్రితం లా కమిషన్ ప్రతిపాదనలకు చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరాన్ని న్యాయమూర్తి నొక్కిచెప్పారు.
మహిళలను, మైనర్లను అమ్మినా, పాలుపంచుకున్నా ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని 1993లో లా కమిషన్ ప్రతిపాదించింది. ఈరోజు వరకు ఆ ప్రతిపాదనలు అమలుకు నోచుకోకపోవడం వల్లే చిన్నారులు మార్కెట్లో కూరగాయల మాదిరిగా అమ్ముడవుతున్నారని చెప్పారు. నెలరోజుల వయసున్న శిశువు అమ్మకానికి సంబంధించిన కేసు విచారణలో న్యాయమూర్తి పై విధంగా వ్యాఖ్యానించారు.
శిశువును రూ. లక్షకు అమ్మేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత చివరి క్షణంలో ఈ వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళయి ఎనిమిదేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో శిశువును కొనుక్కునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అమ్మకానికి సూత్రధారిగా వ్యవహరించిన నర్సును సైతం పోలీసులు అరెస్టు చేశారు. దోషులు ముగ్గురికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.