‘పెద్ద’లకు రాహుల్ పిలుపు: గోవా చీఫ్ రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ సీనియర్లు వేగంగా స్పందిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సందర్భంగా పార్టీలో యువతకు అవకాశం కల్పించేందుకు సీనియర్లు తప్పుకోవాలని రాహుల్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాహుల్ ప్రసంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
గత ఆదివారం కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోయువ రక్తానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. అంతేగాక, అవసరమైతే పార్టీలోని సీనియర్లు త్యాగాలు చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. కాగా, రాహుల్ పిలుపు మేరకు తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు 72ఏళ్ల శాంతారామ్ చెప్పారు.
ఈ సందర్బంగా శాంతారామ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ప్రసంగం అనంతరం అక్కడికక్కడే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా.. కానీ, అది సరైన సమయం కాదని భావించి, మంగళవారం రోజున పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. పార్టీలో యువతకు అవకాశం ఇవ్వాలన్న రాహుల్ పిలుపును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలావుంటే, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ భరత్ సిన్హా సోలంకి కూడా రాజీనామా చేసినట్లు తెలిసింది.