ఐఎన్ఎక్స్ మీడియా కేసు: తీహార్ జైలుకు చిదంబరం..సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను సెప్టెంబర్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పజెబుతూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిదంబరంను అప్పటి వరకు తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ ఈ కేసులో వాదనలు విన్నారు. చిదంబరంను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనపై జస్టిస్ అజయ్ కుమార్ పరిగణలోకి తీసుకుని పై ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: తీహార్ జైలుకు చిదంబరం..సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ
వాదనలు ఇలా జరిగాయి
చిదంబరంను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ వాదనను తప్పుబట్టారు చిదంబరం తరుపున న్యాయవాది కపిల్ సిబల్. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్లో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంను ఈడీ కస్టడీకి అప్పగించాలంటూ కోరారు. అయితే చిదంబరం తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబాల్ వాదనలను జడ్జి పరిగణించలేదు. గురువారంతో సీబీఐ కస్టడీ ముగియడంతో చిదంబరంను ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది సీబీఐ.
సాక్ష్యులను ప్రభావితం చేసినట్లు ఆధారాలు లేవు: కపిల్ సిబల్
ఇప్పటి వరకు అంటే ఆగష్టు 21న చిదంబరం అరెస్టు అయినప్పటినుంచీ ఐదుసార్లు ఆయన్ను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. మొత్తం 15 రోజుల పాటు సీబీఐ కస్టడీలో చిదంబరం ఉన్నారు. ఇక గురువారం కోర్టులో హాజరుపర్చగానే సీబీఐ తన వాదనలను వినిపించింది. చిదంబరం పలుకుబడి ఉన్న వ్యక్తి కనుక సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అందుకే ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది. అయితే చిదంబరం విచారణకు భంగం కలగజేసినట్లుగానీ, ఒకరిని ప్రభావితం చేసినట్లుగానీ ఎక్కడా ఆధారాలు లేవని కపిల్ సిబాల్ వాదించారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీకి వెళ్లేందుకు చిదంబరం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు చిదంబరం సరెండర్ అవుతారని ఈడీ కస్టడీలోకి తీసుకోవచ్చని కోర్టుకు విన్నవించారు. తీహార్ జైలుకు తాను ఎందుకు వెళ్లాలని, కావాలంటే ఈడీని వారి కస్టడీకి తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని చిదంబరం న్యాయస్థానానికి చెప్పారు.
నేను చేసిన నేరమేమిటో రుజువు చేయలేకపోయారు: చిదంబరం
ఇప్పటి వరకు తాను చేసిన నేరమేమిటో రుజువు చేయలేకపోయారని, చార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు తాను ఏదో ప్రభావితం చేయగల వ్యక్తినని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిదంబరం అన్నారు. దీనికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఇక సాక్షాధారాలను ట్యాంపర్ చేస్తానని చెప్పేందుకు రుజువు లేదని చెప్పారు. చిదంబరం వ్యాఖ్యలను సిబల్ కోర్టుముందు ఉంచారు. అయితే సిబల్ చిదంబరంకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వాదనలు వినిపిస్తున్నట్లుగా ఉందని అడ్డు చెప్పారు సాలిసిటర్ జనరల్.
చిదంబరం సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదముంది: సీబీఐ
ఇక జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరుతున్న సీబీఐ...విచారణ సంస్థ దాఖలు చేసిన అప్లికేషన్లో అసలు జ్యుడీషియల్ కస్టడీ కోసం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని సిబల్ వాదించారు.ఇదిలా ఉంటే అసలు తన వాదనలు దేనికోసం వినిపిస్తున్నారని సాలిసిటర్ జనరల్ ప్రశ్నించారు. దీంతో చిదంబరం విడుదల కోసం తాను వాదిస్తున్నట్లు సిబల్ చెప్పారు. ఇక చిదంబరం విదేశీ బ్యాంకులను ప్రభావితం చేస్తున్నారని, విచారణకు సహకరించడం లేదని, ఒకవేళ బ్యాంకులను ప్రభావితం చేస్తే ఆ బ్యాంకులు కూడా విచారణలో భాగంగా సహకరించే పరిస్థితి ఉండదని సాలిసిటర్ జనరల్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే పక్కదారి పట్టించిన నేరంగా పరిగణించాలని చెప్పారు. కేసులో సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి పేరును న్యాయస్థానంకు రహస్య పద్ధతిలో సమర్పించిన మెహతా... ఈ వ్యక్తిని చిదంబరం ప్రభావితం చేసే శక్తి ఉందని అందుకే పేరును బహిరంగంగా వెల్లడించలేమని చెప్పారు. అంతేకాదు చిదంబరం విడుదలకు ఇంకా సమయం రాలేదంటూ తన వాదనలు వినిపించారు.
ఇరు వైపుల నుంచి వాదనలు విన్న ప్రత్యేక జడ్జి చిదంబరంను సెప్టెంబర్ 19 వరకు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.