రాజ్యాంగం రాతప్రతిలో శ్రీరాముడి చిత్రాలు.. వాటిని నెహ్రూ కావాలనే తొలగించారు: బీజేపీ ఎంపీ పర్వేశ్
దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందన్న ప్రతిపక్ష పార్టీల వాదనను అధికార బీజేపీ బలంగా తిప్పికొట్టింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల దేశంలోని ముస్లింలకు ఎలాంటి ప్రమాదం తలెత్తబోదని భరోసా ఇచ్చింది. కేవలం ముస్లింలు లేదా కొన్ని సముదాయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకే ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించారంటూ ఎదురుదాడికి దిగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఈ మేరకు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
రాజ్యాంగం కూడా మతపరమైందేనా?
‘‘జైశ్రీరాం నినాదమిస్తే బీజేపీ మతతత్వపార్టీ అయిపోతుందా? ఈ విషయంలో అడ్డగోలుగా విమర్శలు చేసే ప్రతిపక్షాలకు నేనో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మన భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీ(రాతప్రతి)లో శ్రీరాముడు, సీతమ్మవారి చిత్రాలు ఉండేవి. వాటిని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కావాలని తొలగించారు. ఇవాళ్టికి కూడా రాజ్యంగంలో హనుమంతుడు, ఇతర దేవతల బొమ్మలున్నాయి. అంటే మన రాజ్యాంగం కూడా మతపరమైందే అనుకోవాలా?''అని పర్వేశ్ వర్మ ప్రశ్నించారు.
సీట్లు తగ్గుతున్నా తెలియట్లేదా?
గతంలో అధికారాన్ని వెలగబెట్టి, ప్రస్తుతం ప్రతిపక్షానికే పరిమితమైన పార్టీలు చేసిన చారిత్రక తప్పులను మోదీ ప్రభుత్వం సరిచేస్తున్నదని ఎంపీ పర్వేశ్ వర్మ చెప్పారు. దేశం పట్ల తమ వైఖరి వల్లే ప్రతిపక్ష పార్టీలు రోజురోజుకూ కుచించుకుపోతున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘గత ప్రభుత్వాలు సమస్యల్ని పరిష్కరించాలంటే కొన్ని యుగాలు పట్టేది. ఇవాళ మేం పరిష్కార మార్గాలు చూపిస్తుంటే, మళ్లీ అవే పార్టీలు అడ్డుపడుతూ గందరగోళం చేస్తున్నాయి''అని విమర్శించారు.
పర్వేశ్ పై చర్యలకు డిమాండ్
కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పర్వేజ్ వర్మ చేసిన విద్వేష వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలు లోక్ సభలో ఆందోళన చేశాయి. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్ బాగ్ లో నిరసనలు చేస్తున్న ఉద్యమకారులు.. హిందువుల ఇళ్లలోకి చొరబడి మహిళల్ని రేప్ చేస్తారని ఓసారి, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టెర్రరిస్టు అని మరోసారి పర్వేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎన్నికల సంఘం తప్పుపట్టడంతో బీజేపీ ఆయనను స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించింది.