తినే ఆహారంలో, తాగే నీళ్లలో విషం.. ట్రక్కులతో తొక్కిచ్చి..: భారతలో మారణహోమానికి ఐసిస్ ప్లాన్!
ఐఎస్ ఉగ్రవాది అబ్దుల్ రషీద్ విడుదల చేసిన ఆడియో టేప్ ఒకటి కలకలం రేపుతోంది. భారత్ లో మారణ హోమం సృష్టించమంటూ ఐఎస్ సానుభూతిపరులకు అతడు ఆ ఆడియో టేప్ లో స్పష్టమైన ఆదేశాలిచ్చాడు.
Recommended Video
న్యూఢిల్లీ: ఐఎస్ ఉగ్రవాదులు భారత్లో మారణహోమం సృష్టించబోతున్నారా? యూరప్ తదితర దేశాల్లో భారీ వాహనాలను జనాలమీదకు పోనిచ్చినట్లుగా నరమేధానికి ప్లాన్ వేసుకున్నారా? ముఖ్యంగా హిందూ పండగలే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నారా?
ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చేలా ఐఎస్ ఉగ్రవాది అబ్దుల్ రషీద్ విడుదల చేసిన ఆడియో టేప్ ఒకటి కలకలం రేపుతోంది. ఆఫ్ఘన్లోని టెలిమెసెంజర్ అలాగే ఇన్స్టాంట్ చాట్ అప్లికేషన్స్ ద్వారా ఈ ఆడియో క్లిప్ ప్రచారం అవుతున్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. రషీద్పై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కేరళ పోలీసులు కూడా రషీద్ నేపథ్యంపై ఆరా తీస్తున్నారు.
'హిందువులు తినే ఆహారంలో, తాగే నీళ్లలో విషం కలపండి. త్రిస్సూర్ పూరమ్, మహా కుంభమేళ జరిగే ప్రాంతాల్లో జనాలపైకి భారీ వాహనాలను నడపండి..' అంటూ ఆ ఆడియో టేప్ లో ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులకు రషీద్ పిలుపు ఇచ్చాడు.
పదినిమిషాల ఆ ఆడియో టేప్ మలయాళం భాషలో ఉంది. భారత్కు చెందిన రషీద్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఆఫ్ఘన్ కేంద్రంగా ఐఎస్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
ఒక్కో ఉగ్రవాది 'ఒంటరి తోడేళ్ల' మాదిరి హిందువులపై విరుచుకుపడాలని అబ్దుల్ రషీద్ తన ఆడియో మెసేజ్ లో పిలుపిచ్చాడు. 'మన మద్దతుదారుడు లాస్వెగాస్ మ్యూజిక్ కన్సర్ట్కు వచ్చిన అనేక మందిని చంపేశాడు. మీరు కూడా ప్రయత్నించండి. రైళ్లను పట్టాలు తప్పించండి లేదా ఒక కత్తి అయినా ఉపయోగించండి..' అని రషీద్ చెప్పాడు.
'మీలో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు. కాఫిర్లను చంపడానికి మీ తెలివితేటలు ఉపయోగించండి. చంపేయండి వారిని. ప్రజాస్వామ్యాన్ని, హిందూయిజాన్ని, క్రైస్తవాన్ని నాశనం చేయండి. అల్లా ఆదేశాలతో రాజ్య పాలన చేయండి. ఒకవేళ మీరు ఇలాంటి పనులు చేయలేకపోతే ఐసిస్ కు ఆర్థికంగా సాయపడండి..' ' అని ఆడియో టేప్లో రషీద్ సూచించాడు.