ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి: ప్రధాని మోడీ అధ్యక్షతన కమిటీ నిర్ణయం
బెంగుళూరు: అంతరిక్ష పరిజ్ఞానం, ఉపగ్రహ ఆధారిత సేవల ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడుతున్నందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) 2014వ సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతికి ఎంపికైంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన న్యాయనిర్ణేతల బృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బృందంలో భారత దేశ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు, లోక సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, పార్లమెంట్ సీనియర్ సభ్యుడు ఎల్కే అద్వానీ, గోపాలకృష్ణ గాంధీ తదితరులు ఉన్నారు.
అంహిసా మార్గంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ మార్పు కోసం కృషి చేసినవారికి గాంధీ బహుమతిని ఇస్తున్న విషయం తెలిసిందే. 1995లో ఆరంభించిన ఈ బహుమతి కింద రూ. కోటి రూపాయల నగదుతో పాటు, ప్రశంసాపత్రం ప్రదాన చేస్తారు.
ఇక ఇస్రో విషయానికి వస్తే ప్రపంచంలోనే ఆరవ అతి పెద్ద అంతరిక్ష పరిశోధన సంస్ధగా పేరుగాంచింది. గతంలో ఈ అవార్డును నెల్సన్ మండేలా, బాబా ఆమ్టే, ఆర్చ్ బిషప్ దేశ్మోండ్ టుటు, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్, భారతీయ విద్యాభవన్, రామకృష్ణ మిషన్లకు ఇచ్చారు.