కాసేపట్లో నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1 - ఆజాదీశాట్ స్పెషల్..!!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి రంగం సిద్దం అయింది. ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుడుతోంది. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ- డీ1) నింగిలోకి దూసుకెళ్లనుంది. సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగించనున్నారు. షార్ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్ఎస్ఎల్వీ డీ1 సిరీస్లో ఇదే మొదటిది.
Recommended Video
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీ వంతు మొదలైంది. 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్ఎస్ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయనున్నారు. ఆజాదీకా మహోత్సవ్ వేళ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీశాట్ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా ప్రయోగాన్ని డిజైన్ చేశారు.
ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్లోని అన్ని వ్యవస్థలను ఉత్తేజితం చేయడానికి కౌంట్డౌన్ను 7 గంటలుగా నిర్ణయించారు. నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్-2ఏ(ఈఓఎస్శాట్)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెడతారు. 'ఆజాదీ కా అమృత్' మహోత్సవ్లో భాగంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్న ఈ 'ఆజాదీశాట్' అభివృద్ధిలో దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది చొప్పున మొత్తం 750 బాలికలు ఈ శాటిలైట్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.