కాంగ్రెస్కు భారీ షాక్: పీసీ చాకో రాజీనామా, అధిష్టానమే లక్ష్యంగా తీవ్ర విమర్శలు, కేరళలో ఎఫెక్ట్
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పీసీ చాకో బుధవారం రాజీనామా చేశారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్రమైన విమర్శలు చేయడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీలో వారికి ప్రాధాన్యతేది?
కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామ చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని పీసీ చాకో ఆరోపించారు. పీసీ చాకో త్రిసూర్ మాజీ కాంగ్రెస్ ఎంపీ . ప్రతిభ ఉన్న నాయకులకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది అధినేత లేకుండా నడుస్తోందన్నారు.
రెండుగా చీలిన కాంగ్రెస్.. గెలిచే వారికి టికెట్లివ్వరు..
ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులను పార్టీలోని ఒకరిద్దరు నేతలే ఎంపిక చేస్తారని చాకో ఆరోపించారు. గెలిచే అభ్యర్థులకు టికెట్లు కేటాయించే అవకాశాలు ఉండవని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండు(ఏ అండ్ ఐ)గా చీలిపోయిందని చాకో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు సరైన సూచనలు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. స్థానికంగా పట్టున్న నాయకులకు టికెట్ కేటాయించాలని కోరినప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వారిని విస్మరిస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యమే లేదు
ఏడాది గడిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన అధ్యక్షుడిని ఎంపిక చేసుకోలేకపోయిందని చాకో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేయడం తనకు సమ్మతకం కావడం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు. ఈ పార్టీ కారణంగా దేశంలో కూడా ప్రజాస్వామ్యం లేకుండా పోతుందని దుయ్యబ్టారు.
కాంగ్రెస్ అధిష్టానాన్ని గానీ, రాహుల్ని గానీ ఎవరూ ప్రశ్నించలేరు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని గానీ, రాహుల్ గాంధీని గానీ ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేదని ఆరోపించారు చాకో. అంతేగాక, కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలవాలని కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా లేవని తేల్చి చెప్పారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చాకో రాజీనామా చేయడం ఆ పార్టీ విజయావకాశాలపై కూడా ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు 47 స్థానాలు కూడా ఇప్పుడు దక్కించుకోవడం కష్టసాధ్యమనే అంటున్నారు.