IT Hub: ఎలుక దెబ్బతో పోలీసు పంచాయితీ పెట్టిన అపార్ట్ మెంట్ నివాసులు, రూ. 5 లక్షలు పరిహారం !
బెంగళూరు: ఆస్తుల కోసం గొడవపడటం, పాతకక్షలతో గొడవలు పడటం, చుట్టుపక్క వాళ్లు గొడవలు చేస్తున్నారని కేసులు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి కేసుల పంచాయితీలు చెయ్యడానికి పోలీసులు పని చేస్తున్నారు. అయితే ఐటీ హబ్ లో ఓ వ్యక్తి మీద అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లు పెట్టిన కేసుతో పోలీసులు హడలిపోయారు. ఎలుక తెచ్చిన పంచాయితీ కేసు పరిష్కరించడానికి పోలీసులు తలలు పట్టుకున్నారు.
ఇన్నోవా కారు
బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర్ లో లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లక్ష్మీ నారాయణ బందువులు ఆర్ టీ నగర్ లోని కంఫర్ట్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నాడు. బంధువులు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో లక్ష్మీ నారాయణ అతని ఇన్నోవా కారు పార్క్ చేశారు. అయితే అపార్ట్ మెంట్ లోని ఎలుకలు ఇన్నోవా కారు వైర్లు మొత్తం కొరికేశాయి.
ఎలుక చేసిన పనికి పంచాయితీలు
కారు తియ్యడానికి ప్రయత్నించిన లక్ష్మీ నారాయణ ఎలుకలు వైర్లు మొత్తం కొరికేశాయని తెలుసుకుని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారి మీద మండిపడ్డాడు. మీ అపార్ట్ మెంట్ లోని ఎలుకలు నా కారు వైర్లు కొరికేశాయని, రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడానికి అపార్ట్ మెంట్ నిర్వహకులు నిరాకరించాడు.
రూ. 5 లక్షల పరిహారం కోసం డిమాండ్
రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వడం లేదని రగిలిపోయిన లక్ష్మీ నారాయణ అతని ఇంటిలోని చెత్త తీసుకెళ్లి అపార్ట్ మెంట్ లో వెయ్యడం మొదలుపెట్టాడు. రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వకపోతే మీ అంతు చూస్తానని లక్ష్మీ నారాయణ బెదిరిస్తున్నాడని, ప్రతిరోజు చెత్త తెచ్చి అపార్ట్ మెంట్ ముందు వేస్తున్నాడని ఆపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లు లక్ష్మీ నారాయణ మీద ఆర్ టీ నగర్ లో కేసు పెట్టారు. ఎలుక వలన ఇంత గొడవ జరిగిందని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యి ఇరు వర్గాల వారితో చర్చలు జరుపుతున్నారు.