ఓటేయడం నా హక్కు, కానీ, ఇప్పుడు సాధ్యం కాదు: విజయ్ మాల్యా
బెంగుళూరు: మే 12వ తేదిన జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం తన ప్రజాస్వామిక హక్కు అని లిక్కర్ కింగ్, బ్యాంకులకు కోట్లాది రుణాలను ఎగవేసిన కేసులో నిందితుడు విజయ్ మాల్యా చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేదని విజయ్ మాల్యా చెప్పారు.
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయాలను ఎగవేసిన కేసులో విజయ్ మాల్యా నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం విదేశాల్లో మాల్యా తలదాచుకొంటున్నాడు. అయితే ఈ కేసులో విజయ్ మాల్యాలకు బ్రిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బ్యాంకులకు సుమారు రూ.9 వేల కోట్ల బకాయిలు, మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాల్యా రెండేళ్ళుగా బ్రిటన్లో తలదాచుకొంటున్నాడు. అయితే బెయిల్ నిబంధనల ప్రకారంగా విజయ్ మాల్యా బ్రిటన్ను వీడే అవకాశం లేకుండాపోయింది.
అయితే కర్ణాటక రాజకీయాల విషయమై తాను ఏమీ వ్యాఖ్యానించలేనని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో కర్ణాటక రాజకీయాలను తాను పరిశీలించలేదని ఆయన చెప్పారు. ఈ కారణంగానే తాను ఈ విషయమై వ్యాఖ్యానించే అవకాశం లేదని చెప్పారు.