అక్రమాస్తులు, మంత్రి మీద చర్యలు తీసుకోండి, సీఎంకు ఐటీ శాఖ లేఖ, వీకే శశికళ!
చెన్నై: తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సీ. విజయ్ భాస్కర్ మీద చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్రమాస్తుల కేసు విషయంలో మంత్రి సీ. విజయ్ భాస్కర్ మీద వేటు పడే అవకాశం ఉందని సమాచారం. గతంలో శశికళ వర్గీయులకు అత్యంత సన్నిహితుడు అయిన విజయ్ భాస్కర్ ఇప్పుడు అయోమయంలో పడిపోయారు.

అమ్మ మరణం
జయలలిత మరణించిన తరువాత చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించడానికి అప్పట్లో ఎన్నికల కమిషన్ సిద్దం అయ్యింది. వీకే. శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు.

ఓటర్లకు భారీగా డబ్బు
ఆ సమయంలో తమిళనాడు ప్రభుత్వం శశికళకు మద్దతుగానే వ్యవహరించింది. ఆ సమయంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ మొత్తంలో టీటీవీ దినకరన్ వర్గీయులు నగదు పంపిణి చేస్తున్నారని పన్నీర్ సెల్వం వర్గం ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.

రూ. 2 వేల నోట్ల కట్టలు
ఆ సందర్బంలో మంత్రి సీ. విజయ్ భాస్కర్ ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు పంపిణి చేస్తున్నారని ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిలో భారీ మొత్తంలో రూ. 2,000 నోట్ల కట్టలను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను రద్దు చేశారు.

శశికళ బంధువులు
శశికళ వర్గీయులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం ఒక్కటి అయ్యింది. తరువాత విజయ్ భాస్కర్ ను మంత్రి వర్గంలో కొనసాగిస్తున్నారు. మంత్రి విజయ్ భాస్కర్ మీద ఆరోపణలు రుజువు కాలేదని ఇంతకాలం తమిళనాడు ప్రభుత్వం చెప్పింది.

అక్రమాస్తులకు లెక్కలు లేవు
ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణలో మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిలో స్వాధీనం చేసుకున్న సోమ్ముకు సరైన లెక్కలు చూపించలేదని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications