ఏమి అందం? .. ఎంత సౌందర్యం?.. ట్రంప్ కూతురు ఇవాంక మైమరపు
అమెరికా అధ్యక్షుడి భారత పర్యటనలో సెంటర్ ఆప్ అట్రాక్షన్గా నిలుస్తోన్న ఇవాంకా ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను ప్రేమించి పెళ్లాడిన జెరెడ్ కుష్నర్ తోడురాగా.. ప్రేమకు నిలయమైన తాజ్ మహల్ లో ఆమె సంబురంగా తిరిగారు. తాజ్ అందాన్ని చూసి మైమర్చిపోయానంటూ ట్వీట్ వదిలారు. కుటుంబంతో కలిసి సోమవారం ఆమె తాజ్ ను సందర్శించారు.
భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబీకులు సోమవారం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. కట్టడం విశిష్టతను గైడ్ ద్వారా తెలుసుకున్నారు. ట్రంప్ కూతురు ఇవాంకా.. తన భర్త జెరెడ్ కుష్నర్తో కలిసి తాజ్ పరిసరాల్లో కలియతిరుగుతూ సందడి చేశారు. ''తాజ్ మహల్ వైభవం, సౌందర్యం అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి''అంటూ ఇవాంక తన సోషల్ మీడియా ఖాతాల్లో రాసుకొచ్చారు.
ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తాజ్ మహల్ ను ఉద్దేశించి ఆసక్తికర వాక్యాలు రాశారు. సోమవారం అక్కడికి వెళ్లిన ఆయన.. భార్య మెలానియాతో కలిసి తాజ్ పరిసరాల్లో కలియదిరిగారు. ''సుసంపన్నమైన, వైవిధ్యమైన భారతీయ సాంస్కృతిక సౌందర్యానికి.. తాజ్ మహల్ ఓ కాలాతీతమైన చిహ్నం''అని విజిటర్స్ బుక్ లో ట్రంప్ రాశారు.
తొలిరోజు అహ్మదాబాద్ లో ల్యాండైన ట్రంప్.. సబర్మతి ఆశ్రమ సందర్శనతో తన భారత పర్యటన ప్రారంభించారు. మధ్యాహ్నం మోతేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్'కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ రెండు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఆయనవెంటనే ఉంటారు. సాయంత్రం ఆగ్రాలో తాజ్ దర్శనం తర్వాత ట్రంప్ టీమ్ ఢిల్లీలోని మౌర్య హోటల్ కు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ కు వెళ్లడం ద్వారా ట్రంప్ తన రెండో రోజు పర్యన ప్రారంభిస్తారు. అదేరోజు రాత్రికి అమెరికా తిరుగుపయనమవుతారు.