అమర్నాథ్ దుర్ఘటన: బస్సు డ్రైవర్ సలీమ్కు రివార్డుల వెల్లువ, మృతుల కుటుంబాలకు పరిహారం
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర్నాథ్ యాత్ర మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వంతో పాటు అమర్నాథ్ యాత్రికుల బోర్డు(ఎస్ఏఎస్బీ) పరిహారాన్ని ప్రకటించింది.
శ్రీనగర్: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర్నాథ్ యాత్ర మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వంతో పాటు అమర్నాథ్ యాత్రికుల బోర్డు(ఎస్ఏఎస్బీ) పరిహారాన్ని ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
అలాగే ఎంతో చాకచక్యంగా బుల్లెట్లు దూసుకొస్తున్నా ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించిన బస్సు డ్రైవరు సలీమ్ మీర్జాకు రూ.3 లక్షలు రివార్డు ఇస్తున్నట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ఎస్ఏఎస్బీ ప్రకటించింది.
తీవ్రంగా గాయపడిన వారికి రూ.1.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.75,000 ఇస్తున్నట్లు తెలిపింది. బస్సు డ్రైవర్ సలీమ్కు జమ్ముకశ్మీర్ గవర్నరు వొహ్రా ప్రత్యేకంగా రూ.2 లక్షల రివార్డును ఇస్తున్నట్లు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.