ఇంకా అస్పష్టమే: డిమాండ్లపై పిడిపి పట్టు, రాంమాధవ్ బిజీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావడం లేదు. తమ డిమాండ్లపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుంచి స్ఫష్టమైన హామీలను కోరుతోంది. గత ఐదు రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై రాష్ట్రంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎవరు ఎవరితో కలుస్తారనేది అయోమయంగానే ఉంది.
ఆర్టికల్ 370ని రక్షించడం, ఎఎఫ్ఎస్పిఎ వంటి అంశాలపై పిడిపి పట్టుబడుతోంది. అన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, అయితే ఏ పార్టీతోనూ ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదని పిడిపి అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ అన్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం బిజెపి నాయకుడు రాంమాధవ్ గత రెండు రోజులుగా తీరిక లేకుండా వ్యవహారాలు నడుపుతున్నారు. తెలుగువాడైన రాంమాధవ్ జమ్మూ కాశ్మీర్లో చక్రం తీప్పే యత్నంలో ఉన్నారు.
రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన తాము ప్రభుత్వ ఏర్పాటుకు గల ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేస్తున్నామని, బిజెపితో పొత్తుపై కూడా చర్చిస్తున్నామని నయీమ్ అక్తర్ అన్నారు. తమతో ఏ పార్టీ పొత్తుకు ముందుకు వచ్చినా తమ డిమాండ్లకు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని రక్షించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
భవిష్యత్తు మిత్ర పక్షంతో ముఖ్యమంత్రి పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టే విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. ఏ పార్టీతోనూ చర్చలు ఆ దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని, దాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిందనే విషయాన్ని ప్రస్తావించగా తమకు అటువంటి సమాచారమేదీ అందలేదని అన్నారు. అటువంటి ప్రతిపాదన వస్తే తప్పకుండా చర్చించి పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.