మోడీపై ఫైట్: ములాయం చొరవ, 'జనతా పరివార్' ఏకం
న్యూఢిల్లీ: ప్రదాని నరేంద్ర మోడీని ధీటుగా ఎదుర్కోవడానికి జనతా పరివార్ ఏకం కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీ, జెడి (యు), జెడి (ఎస్), ఆర్జెడీలు ఏకమై మోడీని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. తొలుత యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి, ఆ తర్వాత ఏక పార్టీగా రూపుదిద్దుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆ దిశగా చొరవ ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో ములాయం సింగ్ నివాసంలో సుదీర్ఘ సమావేశం జరిగింది. కలిసి పనిచేసి, సింగిల్ పార్టీగా అవతరించాలనే ఆలోచన చేసినట్లు సమావేశానంతరం జెడి(యు) నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు.
పార్టీల మద్య ఐక్యత ఉండాలనే విషయంపై విస్తృతస్థాయిలో అంగీకారం కుదిరినట్లు చెప్పారు. పార్లమెంటు లోపల, బయటా కలిసి పనిచేస్తామని చెప్పారు. నల్లధనం, రైతుల దుస్థితి, నిరుద్యోగం వంటి సమస్యలపై డిసెంబర్ 22వ తేదీన ఈ పార్టీలన్నీ ఢిల్లీలో ధర్నా చేస్తాయని ఆయన చెప్పారు. విలీనం ప్రక్రియను ముందుకు తీసుకుపోయే బాధ్యతను ములాయం సింగ్కు అప్పగించినట్లు తెలిపారు.

పార్టీలను ఐక్యం చేయడానికి అవసరమైన సూత్రాలను ములాయం సింగ్ ఖరారు చేస్తారని అన్నారు. ఆ తర్వాత తాము తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ పార్టీల విలీనం దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. వర్తమాన రాజకీయ సందర్భంలో తమ సిద్ధాంతం ఒక్కటేనని, ప్రతిపక్షం ఏకం కావాలని, ఏకమైతే గొంతు శక్తి పెరుగుతుందని ఆయన అన్నారు.
మోడీకి భయపడి కలిసిపోవాలని అనుకుంటున్నారా అని అడిగితే అది ఒక్క వ్యక్తి భయానికి సంబంధించిన విషయం కాదని, అది దేశానికి సంబంధించిందని నితీష్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని దేవెగౌడ, లాలూ ప్రసాద్ యాదవ్, అభయ్ చౌతాలా కూడా పాల్గొన్నారు. కొత్త ఫ్రంట్కు సమాజ్వాదీ జనతాదళ్ అని పేరు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దానికి ములాయం సింగ్ను అధ్యక్షుడిగా నియమించవచ్చు.
ఈ ఐక్య ఫ్రంట్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెసు, కరుణానిధి డిఎంకె, నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ చేరుతాయా, లేదా అనే ఆసక్తి నెలకొంది. 2014 ఎన్నికల్లో బిజెపి చేతిలో ఘోరంగా దెబ్బ తిన్న పార్టీలు ఒకే గొడుగు కిందికి రావడం గమనార్హం.












Click it and Unblock the Notifications