తొలి జయంతి.. తమిళనాట అమ్మ నామస్మరణ.. జయ జీవితం ఇలా..
పురుషాధిక్య సమాజంలో ధీర వనితగా అటు సినిమాల్లోను.. ఇటు రాజకీయాల్లోను తనదైన ముద్రవేసిన ఘనమైన చరిత్ర దివంగత సీఎం జయలలితది. తమిళ ప్రజల ఆరాధ్య నేతగా మారి..
చెన్నై: పురుషాధిక్య సమాజంలో ధీర వనితగా అటు సినిమాల్లోను.. ఇటు రాజకీయాల్లోను తనదైన ముద్రవేసిన ఘనమైన చరిత్ర దివంగత సీఎం జయలలితది. తమిళ ప్రజల ఆరాధ్య నేతగా మారి.. వారిచేత అమ్మగా కీర్తించబడిన జయలలిత తొలి జయంతి నేడు.
గతేడాది డిసెంబర్ లో నాటకీయ పరిణామాల నడుమ అపోలో ఆసుపత్రిలో జయలలిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికంగా దూరమైన నేపథ్యంలో.. తొలి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అటు అన్నాడీఎంకె వర్గాలతో పాటు ఇటు తమిళ ప్రజలు కూడా ఏర్పాట్లలో మునిగిపోయారు.
మరోవైపు అమ్మ నెచ్చెలి శశికళ సైతం గురువారం నాడు పార్టీ వర్గాలకు సందేశం పంపించిన సంగతి తెలిసిందే. తొలి జయంతిని ఘనంగా నిర్వహించాలని, సామూహిక అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని, అమ్మ ఫోటోను అభిమానుల సందర్శనార్థం ఏర్పాటు చేసి నివాళి అర్పించాలని పార్టీ వర్గాలకు చిన్నమ్మ విజ్ఞప్తి చేశారు.
అమ్మకు నిజమైన వారసులం మేమంటే మేమని అటు పన్నీర్ వర్గంతో పాటు ఇటు చిన్నమ్మ వర్గం ఢీ అంటే ఢీ అన్న తరహాలో సాగిస్తున్న రాజకీయాల నేపథ్యంలో.. అమ్మ తొలి జయంతిని జరుపుకోవాల్సిన సందర్బం రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇరువర్గాలు పోటాపోటీగా అమ్మ జయంతిని నిర్వహించడానికి పోటీ పడుతారని భావించినా.. ఇప్పటికైతే అన్నాడీఎంకె వర్గాల నుంచి తప్పితే పన్నీర్ వర్గం నుంచి అమ్మ జయంతికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఎలాంటి సంకేతం అందలేదు.
అన్నాడీఎంకె వర్గాలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అమ్మ నామస్మరణను తలపించే ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. తమిళనాడు వ్యాప్తంగా అమ్మ ప్రసంగాలు, ఆమె జీవిత విశేషాలను తెలిపే కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయలలిత జీవిత విశేషాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం..
రహస్య జీవితం:
దివంగత సీఎం జయలలిత తన జీవితంలో అత్యంత గోప్యత పాటించారు. సన్నిహితులు, స్నేహితులు, ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా ఆమె దూరం పెట్టారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయ నిర్ణయాల దాకా అంతా రహస్యంగానే కానిచ్చేవారు.
మైసూర్ లో జన్మించిన అమ్మ:
1948 ఫిబ్రవరి 24వ తేదిన మైసూరులో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జయరామన్, అలనాటి నటి సంధ్య దంపతులకు జయలలిత జన్మించారు. జయలలిత రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి జయరామన్ మరణించారు. తరువాత తల్లితో కలిసి తమిళనాడులోని స్వగ్రామానికి చేరుకున్నారు.
విద్యాభ్యాసం.. సినీ ఎంట్రీ:
చెన్నైలోని చర్చి పార్క్ స్కూల్ లో జయలలిత స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశారు. చదువుల్లో టాపర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాతి రోజుల్లో ఆర్థిక సమస్యల రీత్యా కేవలం 16ఏళ్ల వయసులో జయలలిత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఆమె సినీరంగ ప్రవేశం వెనుక తల్లి ఒత్తిడి ఉందని చాలామంది చెబుతారు. వెన్ని రాడై అనే తమిళ చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. భరతనాట్యం, మోహినీ అట్టం, కథక్, మణిపురి వంటి నృత్య కళలోను జయలలిత ప్రావీణ్యం సంపాధించింది.
తమిళ, తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో నటించిన జయలలిత.. తన రాజకీయ గురువు ఎంజీఆర్ తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించడం విశేషం.
పొలిటికల్ ఎంట్రీ:
1981లో అన్నా డీఎంకేతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జయలలిత అనతి కాలంలోనేపార్టీ కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. పార్టీలో తనదైన ముద్ర వేయగలగడంలో, ఎంజీఆర్ మన్ననలు పొందడంలో ఆమె సఫలమయ్యారు. ఆ తర్వాత 1984లో ఆమెను రాజ్యసభకు పంపించగా.. ఒకానొక సందర్బంలో నాటి ప్రధాని ఇందిరా సైతం జయలలిత ప్రసంగానికి ముగ్దురాలయ్యారని చెబుతారు.
ఎంజీఆర్ మరణంతో అవమానాలు:
ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్, జయలలితల మధ్య పార్టీ రెండుగా చీలిపోవడమే గాక, ఆయన అంతిమయాత్ర సమయంలో జయలలితకు దారుణమైన పరాభవం ఎదురైంది. ఎంజీఆర్ అంతిమయాత్ర వాహనం నుంచి జయలలితను నెట్టివేయడంతో.. చివరికి ఆమె అంత్యక్రియలకు కూడా హాజరవలైదు.
1991లో తొలిసారి సీఎం:
1991లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకె ఘనవిజయం సాధించడంతో జయలలిత తొలిసారి సీఎం అయ్యారు. నాటి ఎన్నికలకు ముందు ఎల్టీటీటీఈ చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురవగా కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం అన్నాడీఎంకెకు సానుభూతి ఓట్లను కురిపించిందనేది పరిశీలకుల మాట.
జైలు జీవితం:
అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్న జయలలిత రెండు సార్లు సీఎం పదవి నుంచి తప్పుకుని జైలుకు వెళ్లారు. కరుణానిధితో సాగిన రాజకీయ వార్ లో అక్రమాస్తుల కేసు జయలలితకు ప్రతికూలంగా మారింది.
చివరిరోజుల్లో అపోలో ఆసుపత్రిలో:
దాదాపు 75 రోజుల పాటు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత మృత్యువుతో పోరాటం చేసింది. రాజకీయాల్లో ఉన్నంత కాలం ప్రత్యర్థులపై పోరాడింది. అమ్మ మృతిపై పులువురు ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఆ అనుమానాలు నివృత్తి అయ్యేది అనుమానమే. ఈ నేపథ్యంలో తమిళ జనం అమ్మ జయంతి రోజున మరోసారి ఆమెకు ఘనమైన నివాళి అర్పించనున్నారు.