'అమ్మ' చివరి రోజులు మిస్టరీయేనా!.. ఎందుకింత రహస్యంగా..?
అసలు జయలలితకు ఏమైంది? అన్న ప్రశ్నకు సమాధానం అపోలో యాజమాన్యానికి, నిచ్చెలి శశికళకు తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు.
చెన్నై: రాజకీయ జీవితాలు తెరిచిన పుస్తకాలు అన్న సంగతి తెలిసిందే. మిగతా రంగాలతో పోలిస్తే.. ఇక్కడ ఏ దాపరికాలు ఎక్కువ కాలం దాగడం కష్టమే. అందుకే వ్యక్తిగత జీవితాలు సైతం వార్తల్లోకి ఎక్కి వివాదాల్లో నానుతూ ఉంటాయి. తమిళనాడు సీఎం జయలలిత జీవితం కూడా ఇందుకు అతీతం కాదు.
అమ్మ రాజకీయ ప్రస్థానం ఎంత శక్తివంతంగా సాగిందో.. అమె చివరి రోజులు అంత మిస్టరీగా మిగిలిపోయాయి. 74రోజుల పాటు చికిత్స కొనసాగిన అపోలో ఆసుపత్రిలో.. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి దగ్గరగా తెలిసినవారు అతికొద్ది మంది మాత్రమే. కేంద్రానికి గానీ, దేశంలోని ఇతర రాజకీయ ప్రముఖులకు గానీ ఆమె ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం, స్పష్టత లేదు.
ఇన్ని రోజుల హైడ్రామా తర్వాత మొత్తానికి సోమవారం అర్ధరాత్రి ఆమె కన్నుమూసినట్లుగా అపోలో వైద్యులు ప్రకటించారు. జయలలిత మరణించేవరకు ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. అసలు జయలలితకు ఏమైంది? అన్న ప్రశ్నకు సమాధానం అపోలో యాజమాన్యానికి, నిచ్చెలి శశికళకు తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు.
పార్టీ మంత్రులు, పెద్దలకు కూడా జయ ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం లేదు. అందుకే టీవీల్లో వార్తలు చూసి పార్టీ కార్యాలయంపై జెండాను దింపేసి ఉండవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయ అపోలోలో చేరిన నాటి నుంచి ఆమెకు సంబంధించిన ప్రకటనలన్ని గందరగోళపరిచేవిగానే మారాయి. కోలుకోంటున్నారని, మాట్లాడుతున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లేందుకు జయ సిద్దంగా ఉన్నారని.. ఇలా చాలానే ప్రకటనలు చేశారు. అయితే ఆమెకు సంబంధించిన ఫోటోలు గానీ, వీడియో గానీ బయటకు విడుదల చేయలేదు.
దీంతో జయ ఆరోగ్యం విషయంలో ఇంత గోప్యతను ఎందుకు పాటించారన్న అనుమానాలు తలెత్తాయి.ఏమైనా ఇప్పుడు జయలలిత భౌతికంగా లేరన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి తరుణంలో చివరి రోజుల్లో జయకు జరిగిన చికిత్స వివరాలు.. ఆమె మరణ కారణాలు ఇక ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోవచ్చునేమో!