జిహాద్ కంట్రోల్ బోర్డు: జేసీబీకి కొత్త అర్థం చెబుతున్న బీజేపీ నేతలు జీవీఎల్, సునీల్ దియోధర్
న్యూఢిల్లీ: నేరస్తులకు గుణపాఠం చెప్పేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలను జేసీబీలను, బుల్డోజర్లను ఉపయోగించి వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీలో ఆక్రమణలపైనా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ జేసీబీలను ఉపయోగించి ధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జేసీబీ అంటే జిహాద్ కంట్రోల్ బోర్డ్ అంటూ జీవీఎల్ నర్సింహారావు ట్వీట్
ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఢిల్లీలోని జహంగీర్పురిలో ఆక్రమణలను తొలగించేందుకు కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత.. జేసీబీ అంటే 'జిహాద్ కంట్రోల్ బోర్డ్'తో సమానమని జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్లో పేర్కొన్నారు. జేసీబీ అంటే బుల్డోజర్ను సూచిస్తుంది. తన ట్వీట్లో, జీవీఎల్ భారీ వాహనం చిత్రంతో "JCB = జిహాద్ కంట్రోల్ బోర్డ్ #BuldozerBaba" అని రాశారు.
జేసీబీ అంటే జిహాద్ క్రష్ బోర్డ్ అంటూ సునీల్ దియోధర్
మరో బీజేపీ నేత సునీల్ ధియోధర్ కూడా ఇదే విధంగా జేసీబీ చిత్రాన్ని పోస్టు చేసి ట్వీట్ చేశారు. జేసీబీ అంటే జిహాద్ క్రష్ బోర్డు అంటూ సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. కాగా, బుధవారం, అనేక బుల్డోజర్లు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి దుకాణాలు, ఇళ్లను కూల్చివేశాయి, సుప్రీంకోర్టు కూల్చివేత డ్రైవ్ను నిలిపివేసి, ఈ విషయంపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఆక్రమణల కూల్చివేతలు
ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఆక్రమణల నిరోధక డ్రైవ్ను ప్రకటించింది. మంగళవారం ఆ ప్రాంతంలో భారీగా పోలీసు మోహరింపును అభ్యర్థించింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా శనివారం జహంగీర్పురిలో మత హింసకు పాల్పడిన నిందితులు 'అక్రమ నిర్మాణాలలో' నివసిస్తున్నారని, వాటిని కూల్చివేయాలని డిమాండ్ చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.
ఢిల్లీలో ఘర్షణలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
ఢిల్లీలోని జహంగీర్పురిలో శనివారం సాయంత్రం హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా మత ఘర్షణలు చెలరేగాయి. శోభయాత్రపై ఓ వర్గంవారు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతోపాటు పలువురు గాయపడ్డారు. ఈ హింసాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు పోలీసు అధికారులు.