కర్నాటక సీఎంగా జోషీ ? 8 డిప్యూటీ సీఎంలు- ఆరెస్సెస్ వ్యూహాలు ! కుమారస్వామి సంచలనం..
కర్నాటకలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బ్రహ్మణుడైన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీని సీఎం చేసేందుకు ఆరెస్సెస్ వ్యూహరచన చేస్తోందని మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి ఇవాళ వెల్లడించారు.
కర్నాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి చేపట్టిన పంచరత్న యాత్రకు బదులుగా నవగ్రహ యాత్ర చేసుకోవాలంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశమయ్యాయి. దీనిపై స్పందించిన కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణ నేత ప్రహ్లాద్ జోషిని సీఎం చేసేందుకు ఆరెస్సెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య ఢిల్లీలో ఆరెస్సెస్ నేతలు భేటీ అయ్యారని, ఇందులో కర్నాటక సీఎంగా బ్రహ్మణ నేతను చేయాలని, ఆయనకు 8 మంది డిప్యూటీ సీఎంలను నియమించాలని నిర్ణయించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన దగ్గర బీజేపీ తరఫున డిప్యూటీ సీఎంలు అయ్యేవారి జాబితా కూడా ఉందని కుమారస్వామి వెల్లడించారు. కాబట్టి ఓటర్లు ఆరెస్సెస్ క్రీడలో భాగస్వాములు కావొద్దని కుమారస్వామి కోరారు. దేశంలో ఎప్పటినుంచో రెండు రకాల బ్రాహ్మణులు ఉన్నారని, ఇందులో ఒకరు సమాజంలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నించే వారని, వీరే ప్రఖ్యాత శృంగేరి శ్రద్ధా పీఠాన్ని నాశనం చేశారన్నారు. జోషి ఆ వర్గానికి చెందిన వారేనన్నారు. వీరు మహాత్మాగాంధీని చంపేందుకు కూడా వెనుకాడలేదన్నారు. ఈ రకం బ్రాహ్మణులకు మహారాష్ట్రలోని పేష్వా వర్గాలతోనూ సత్సంబంధాలు ఉండేవన్నారు.

అయితే సమాజంలో మరో రకం బ్రాహ్మణులు సర్వేజనా సుఖినోభవంతు కోరుకునే వారు ఉన్నారని, ప్రహ్లాద్ జోషి ఈ వర్గానికి చెందిన వారైతే కాదని కుమారస్వామి తెలిపారు. కుమారస్వామి కౌంటర్ తో బీజేపీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ స్పందించారు. జోషీ చెప్పిన నవగ్రహాలు రాజకీయాల్లో ఉన్న 9 మంది కుమారస్వామి కుటుంబసభ్యులన్నారు. అలాగే గాంధీ హత్యలో ఆరెస్సెస్ కు ఎలాంటి పాత్రా లేదన్నారు.












Click it and Unblock the Notifications