మోడీకి తలనొప్పి: బీహర్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జెడి( యూ) డిమాండ్
పాట్నా: ప్రధానమంత్రి మోడీకి మరో రాష్ట్రం నుండి ప్రత్యేక హోదా డిమాండ్ ముందుకు తీసుకువచ్చింది. బీహర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జెడి(యూ) కూడ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీహర్లో ప్రధానమంత్రి మోడీ మంగళవారం నాడు పర్యటించనున్నారు.
తమ రాష్ట్రానికి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ప్రకటించాలని జనతాదళ్(యునైటెడ్) పార్టీ సోమవారం కోరింది. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిహార్లోని మోతిహరిలో పర్యటించనున్నారు. చంపారన్ సత్యాగ్రహం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మోదీ అక్కడకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిహార్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని జేడీయూ జనరల్ సెక్రటరీ షాయం రజాక్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.
గత నెలలోనే ఈ విషయం గురించి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ లేవనెత్తారు. 2005లోనే మొదటి సారి బిహార్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని నితీష్ కోరారు. అప్పటి నుంచి మిన్నకుండిపోయిన నితీష్ ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని వైఎస్సార్సీపీ, టీడీపీలు ఢిల్లీలో పోరాటం చేస్తుండటంతో మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. నితీష్ కుమార్ గనక గట్టి నాయకుడైతే బిహార్కు ప్రత్యేక హోదా కావాలని మోదీని డిమాండ్ చేయాలని గత వారం బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.