తప్పిన బియాస్ తరహా ప్రమాదం, 8 గం.లు నీటిలోనే..
బొకారో: జార్ఖండ్ రాష్ట్రంలోని దామోదర్ నదిలో బియాస్ నది తరహా ఘోర ప్రమాదం తప్పింది. చేపలు పట్టడానికి వెళ్లిన పదిమంది యువకులు అదృష్టవశాత్తు ఎలాంటి హానీ లేకుండా బయపడ్డారు. ఇటీవలే హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
శుక్రవారం మధ్యాహ్నం పచౌర గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పదిమంది యువకులు చేపలవేట కోసం దామోదర్ నదిలోకి వెళ్లారు. వారంతా వేటలో నిమగ్నమై ఉండగా తేనూఘాట్ డ్యామ్ స్లూయిస్ గేట్లు ఒక్కసారిగా ఎత్తేశారు. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ రావడంతో ఒక్కసారిగా వరద మట్టం పెరిగిపోయింది.

భయాందోళనకు గురైన యువకులంతా అక్కడే ఉన్న చందాపూర థర్మల్ పవర్ స్టేషన్ కోసం నిర్మించిన కాంక్రీట్ ప్లాట్ఫామ్ పైకి ఎక్కారు. ఎనిమిది గంటల పాటు వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. రంగంలోకి దిగిన అధికారుల రాత్రి బాగా పొద్దుపోయాక వారందరినీ రక్షించారు. బొకారో జిల్లాలోని తేనూఘాట్ డ్యామ్ స్లూయిస్ గేట్లు ఎత్తివేయడంవల్లే ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగిందని డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉమా శంకర్ సింగ్ చెప్పారు.
వేటకు వెళ్లిన వారంతా టీనేజర్లేనని చెప్పారు. వారంతా సమీప గ్రామాలకు చెందిన వారని డిసి తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు సింగ్ స్పష్టం చేశారు. మొత్తానికి ప్లాట్ఫామ్పై ఉన్న పది మంది యువకులను శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సురక్షితంగా కాపాడినట్టు ఆయన చెప్పారు. వారి వయస్సు 15-16 మధ్య ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications