జాన్సన్ అండ్ జాన్సన్ షాకిండ్ డిసిషన్: భారత్లో అనుమతుల దరఖాస్తు ఉపసంహరణ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనావైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్కు అత్యవసర అనుమతి కోసం భారత ప్రభుత్వానికి ఇప్పటికే చేసుకున్న దరఖాస్తును జాన్సన్ అండ్ జాన్సన్ ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు వివరాలను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) వెల్లడించింది.
ఇండెమ్నిటీ (టీకా కారణంగా అనుకోని సమస్యలు తలెత్తిన సందర్భాల్లో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు న్యాయపరమైన చర్యలు నుంచి రక్షణ కల్పించే వ్యవస్థ) విషయంలో చట్టపరమైన చిక్కులను తొలగించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జాన్సన్ అండ్ జాన్సన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అయితే, జాన్సన్ అండ్ జాన్సన్ ఎందుకు తమ అప్లికేషన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే విషయంపై ఆ సంస్థ గానీ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) స్పందించాల్సిం ఉంది. అయితే, వ్యాక్సిన్ అనుమతిపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని జాన్సన్ అండ్ జాన్సన్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
తమ వ్యాక్సిన్కు సంబంధించి భారతదేశంలోనూ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనకు ముందే అమెరికాలో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. ఈ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టొచ్చన్న అనుమానాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమెరికా ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేసింది.
కాగా, మనదేశంలో ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ దేశీయ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా గత కొద్ది వారాలుగా ఇస్తున్నారు. బయోలాజికల్ ఈ అభివృద్ధి చేస్తున్న మరో దేశీయ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది.
Recommended Video
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 14,28,984 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్క కేరళలోనే 20వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. ఆదివారం దేశంలో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3.16 కోట్లకు చేరగా, 4.24 లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.30 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 47.22 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.