5G network: రియల్ లైఫ్ రోబో 2.0: మనుషుల్లో వీర్యం కూడా పుట్టదు: జుహీచావ్లా పిటీషన్
న్యూఢిల్లీ: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 సినిమాను పోలిన ఉదంతం ఇది. సెల్ టవర్లు, సిగ్నళ్ల వల్ల పక్షి జాతి అంతరించిపోతోందంటూ ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉద్యమించిన తరహాలోనే.. నిజజీవితంలో అలాంటి పోరాటానికి ఓ అడుగు పడినట్టు కనిపిస్తోంది. దేశంలో కొత్తగా ప్రవేశ పెట్టదలిచిన 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను దాఖలు చేసింది మరెవరో కాదు.. దేశం మొత్తానికీ సుపరిచితురాలే. ఒకప్పుడు బాలీవుడ్ను ఏలిన అలనాటి హీరోయిన్..జుహీచావ్లా. కొద్దిసేపటి కిందటే ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు.
వంద రెట్లు ప్రమాదకారి
ప్రస్తుతం బాలీవుడ్లో ప్రొడక్షన్ హౌస్ను నిర్వహిస్తోన్నారామె. పర్యావరణ పరిక్షణ కోసం కృషి చేస్తోన్నారు. తాను దాఖలు చేసిన పిటీషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టదలిచిన 5జీ నెట్వర్క్ వల్ల సంభవించబోయే నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న 4జీ టెక్నాలజీ, ఇతర సాంకేతిక నెట్వర్క్తో పోల్చుకుంటే.. 5జీ వంద రెట్లు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలను తన పిటీషన్కు జత చేశారు. జుహీచావ్లా తరఫున ప్రముఖ న్యాయవాది దీపక్ ఖోస్లా ఈ పిటీషన్ను దాఖలు చేశారు.
కడుపులో పిండంపైనా ప్రభావం..
జంతువులు, పక్షులు, ఇతర క్రిమి కీటకాల మనుగడ ప్రశ్నార్థకమౌతుందని పేర్కొన్నారు. వాటికి మాత్రమే కాకుండా.. మనుషుల డీఎన్ఏ నిర్మాణం సైతం ధ్వంసమౌతుందని చెప్పారు. 5జీ నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల కొన్ని రకాల పక్షులు, జీవాలు నాశనమౌతాయని అన్నారు. భూమి మీద నివసించే ప్రజలకే కాదు.. కడుపులో ఉన్న పిండాన్ని సైతం దెబ్బ తీసేంతటి శక్తిమంతమైన రేడియో ఫ్రీక్వెన్సీని 5జీ విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు, పక్షులు, జంతువుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఏ ఒక్కరికీ లేదా ఏ సంస్థకూ లేదని తేల్చి చెప్పారు.
ముప్పు లేదని తేలితేనే..
5జీ టెక్నాలజీ వల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని తేలేంత వరకూ దాన్ని అమలు చేయొద్దని జుహీచావ్లా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇదివరకు బెల్జియం కూడా 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని రావడాన్ని అడ్డుకుందని గుర్తు చేశారు. అనారోగ్య కారకం కాదని తేలిన తరువాతే..ఆ దేశం ఆ పరిజ్ఞానాన్ని అమల్లోకి తెచ్చిందని ఆమె గుర్తు చేశారు. సెల్యులార్ నెట్వర్క్ కింద అనారోగ్యానికి గురైన వారికి చికిత్సను అందించడానికి బీమా కంపెనీలు కూడా అంగీకరించట్లేదని చెప్పారు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో ఈ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ.. కంటికి కనిపించని ఎలక్ట్రోమ్యాగ్నటిక్ కాలుష్యానికి కారణమౌతోందని చెప్పారు.
5జీకి అనుమతి ఇచ్చిన డీఓటీ
దేశంలో 5జీ సెల్యులార్ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకుని రావడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ దాఖలు చేసుకున్న దరఖాస్తులపై ఆమోదముద్ర వేసింది. 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి ఆయా సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ, ముంబై, కోల్కత, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్లల్లో ట్రయల్స్ చేపట్టాల్సి ఉంది. ఆయా టెలికమ్ ఆపరేటర్లకు 700 మెగాహెర్ట్జ్, 3.3-3.6, 24.25-28.5 గిగా హెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయం వంటి రంగాల్లో ట్రయల్స్ చేపట్టనున్నాయి. 4జీతో పోల్చుకుంటే.. 5జీ నెట్వర్క్ పదింతలు వేగంగా పనిచేస్తుందని డీఓటీ నిర్ధారించింది.