"రజనీకి భారతరత్న" : బీజేపీ ఎమ్మెల్యే సంచలన ప్రతిపాదన
ముంబై : నెగెటివ్ రివ్యూలు కూడా కలెక్షన్లను ఏమాత్రం తగ్గించలేని స్టామినా సూపర్ స్టార్ రజనీది. మహారాష్ట్రలో అల్ప పీడనంగా మొదలైన ఆయన ప్రయాణం.. బస్ కండక్టర్ గా కర్నాటక మీదుగా కొనసాగి.. తలైవాగా తమిళనాడులో స్థిరపడి.. ప్రస్తుతం దేశాన్నే ఊపేసే ఓ మేనియాగా మారింది. అందుకు ప్రత్యక్ష తాజా ఉదాహరణ కబాలీ.
ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర ప్రతిపాదన తెర మీదకు రావడం ఇప్పుడు అందరి ద్రుష్టిని ఆకర్షిస్తోంది. మహారాష్ట్ర అధికార బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటే రజనీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర అత్యున్నత పురస్కారం మహారాష్ట్ర భూషణ్ కోసం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు రజనీకాంత్ పేరును ప్రతిపాదించిన ఎమ్మెల్యే అనిల్ గోటే.. మహారాష్ట్ర భూషణ్ తో పాటు భారతరత్నను కూడా రజనీకి ఇప్పించే ప్రయత్నం చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్నప్తి చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కోరిన ఎమ్మెల్యే గోటే, అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందిగా కోరారు.
రజనీని ప్రశంసలతో ముంచెత్తిన ఆయన.. రజనీ అభిమానులకు దేవుడితో సమానమని, కబాలీ విజయం దేశంలో ఆయనుకున్న ఫాలోయింగ్ చాటుతుందని తెలిపారు ఎమ్యెల్యే గోటే. ఇకపోతే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోన్న కబాలి ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్బులో చేరిపోయిన విషయం తెలిసిందే. నెగటివ్ రివ్యూలు కూడా కలెక్షన్లపై ప్రభావం చూపించకపోవడంతో.. రూ.300 కోట్ల వరకు కలెక్షన్స్ పెరగవచ్చునని సినీ వర్గాల అభిప్రాయం.