హాస్టల్ వార్డెన్ ఉద్యోగం, నెలకు రూ. 24 వేలు జీతం, ఆస్తుల విలువ రూ. 250 కోట్లు, టెండర్లలో!
బెంగళూరు: ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి రూ. 250 కోట్ల ఆస్తులు సంపాదించారని వెలుగు చూడటంతో అధికారులతో పాటు సాటి సిబ్బంది హడలిపోయారు. ఒకటి కాదు రెండు కాదు వందల కోట్లరూపాల ఆస్తులు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. టెండర్లలో భారీ ఎత్తున గోల్ మాల్ జరిగిందని సమాచారం.
చిన్న ఉద్యోగం
కర్ణాటకలోని రామనగర జిల్లా, కనకపుర తాలుకాలోని కోడిహళ్లి పంచాయితీ హుణసేనహళ్లిలోని ప్రభుత్వ హాస్టల్ లో నటరాజ్ జూనియర్ వార్డెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న ఉద్యోగం చేస్తున్న నటరాజ్ జీవన శైలి మాత్రం వేరుగా ఉంటోంది. చాలిచాలని జీతాలతో జీవించే సాటి ఉద్యోగులు నటరాజ్ ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆర్ టీఐ కార్యకర్తకు డౌట్
జూనియర్ వార్డెన్ నటరాజ్ మీద ఓ ఆర్ టీఐ కార్యకర్తకు అనుమానం వచ్చింది. కొంతకాలంగా నిఘా వేసిన ఆర్ టీఐ కార్యకర్త కనకపుర 2వ అడిషనల్ జిల్లా న్యాయస్థానంలో నటరాజ్ అక్రమ ఆస్తుల మీద పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు నటరాజ్ మీద నిఘా వేశారు.
రంగంలోకి ఏసీబీ
ఏసీబీ అధికారుల అనుమానం నిజం కావడంతో నటరాజ్ ఇంటి మీద సోదాలు చేశారు. అదే సందర్బంలో నటరాజ్ బంధువులు, సన్నిహితుల ఇళ్లు సోదాలు చేశారు. అంతే నటరాజ్ ఆస్తుల విలువ తెలుసుకున్న ఏసీబీ అధికారులు హడలిపోయారు.
రూ. 250 కోట్ల ఆస్తులు
నటరాజ్ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ లో రూ. 250 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. నటరాజ్ మొదట కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగంలో చేరాడు. అప్పట్లో నటరాజ్ నెల జీతం రూ. 7, 200. ప్రస్తుతం నటరాజ్ కు శాస్వత ఉద్యోగం రావడంతో నెలకు రూ. 24, 000 జీతం వస్తోంది.
టెండర్లలో గోల్ మాల్
పౌరసరఫాల శాఖలో జరిగే టెండర్లలో నటరాజ్ భారీ మొత్తంలో గోల్ మాల్ చేశాడని, అందుకే వందల కోట్లరూపాయల ఆస్తులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి. జూనియర్ హాస్టల్ వార్డెన్ గా ఉద్యోగం చేసే నటరాజ్ కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. రామనగర జిల్లాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో నటరాజ్ సన్నిహితంగా ఉంటున్నాడని సమాచారం.