లోక్ సభ ఎన్నికలకు హీరో ఉపేంద్ర పార్టీ రెఢీ, నేను పోటీ చెయ్యను, సినిమా రంగం, ప్రజా జీవితం!
బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో, ఉత్తమ ప్రజాకీయ పార్టీ (UPP)వ్యవస్థాపకుడు ఉపేంద్ర వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని అన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో తాను మాత్రం పోటీ చెయ్యనని, మా పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తానని హీరో ఉపేంద్ర క్లారిటీ ఇచ్చారు.
దావణగెరెలో హీరో ఉపేంద్ర మీడియాతో మాట్లాడారు. తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 28 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని, ఆ విషయంపై తాము కసరత్తులు చేస్తున్నామని హీరో ఉపేంద్ర అన్నారు.
జాతీయ రాజకీయాల కంటే కర్ణాటక రాజకీయాల మీద హీరో ఉపేంద్ర ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని హీరో ఉపేంద్ర అన్నారు. తనను సినిమా రంగంలో గుర్తించి ఈ స్థాయికి తీసుకువచ్చిన అభిమానులను నిరాశపరచనని హీరో ఉపేంద్ర తెలిపారు.
కర్ణాటకకు ఒక శక్తివంతమైన పార్టీ అవసరం ఉందని, ఆ విషయంలో తాను రాజకీయ పార్టీ స్థాపించానని హీరో ఉపేంద్ర వివరణ ఇచ్చారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని చాల ఆసక్తిగా ఉందని, ఎమ్మెల్యే అయిన తరువాత తాను సినిమా రంగాకి దూరం అయ్యి ప్రజాసేవ చేస్తానని హీరో ఉపేంద్ర అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చెయ్యాలనే విషయం తన అభిమానులు, ప్రజలకు విడిచిపెట్టామని, తమ పార్టీ అభ్యర్థుల విజయం తనకు ముఖ్యమని హీరో ఉపేంద్ర వివరించారు. ప్రజల అభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తామని హీరో ఉపేంద్ర అన్నారు.
అయితే 28 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు ఎంత మంది విజయం సాధిస్తారు అనే విషయం ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదని ఉపేంద్ర వివరించారు. తమ పార్టీ ఎవ్వరితో పోత్తు పెట్టుకోకుండా ఒంటరిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని హీరో ఉపేంద్ర స్పష్టం చేశారు.