తోమర్ స్ధానంలో న్యాయశాఖ మంత్రిగా కపిల్ మిశ్రా
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ కొత్త న్యాయశాఖ మంత్రిగా ఢిల్లీ వాటర్ బోర్డ్ చైర్మెన్ కపిల్ మిశ్రా నియమితులయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ తోమర్ను తప్పుడు సర్టిఫికెట్లు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన సమయంలో, విద్యార్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. తోమర్ రాజీనామాను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెప్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు.
రాష్ట్రపతి ప్రణబ్ కూడా తోమర్ రాజీనామాను అంగీకరించారు. దీంతో ఆయన స్ధానంలో కపిల్ మిశ్రాను ఎంపిక చేశారు. ప్రస్తుతం తోమర్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. అధికారులు ఆయన్ని ఉత్తరప్రదేశ్లోని హైజాబాద్కు తీసుకెళ్లారు. యూపీలోని అవధ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేసినట్లుగా తోమర్ తన ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్నారు.
దీనిని వెరిఫై చేసేందుకు గాను అక్కడికి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత బీహార్కు తీసుకెళ్తారు. బీహార్లోని తిలక్ మాంఝీ భగల్ పూర్ యూనివర్సిటీ నుంచి ఎల్ ఎల్ బి డిగ్రీ చేశానంటూ తోమర్ సర్టిఫికెట్లు సమర్పించారు. దీనిపై కూడా పోలీసులు విచారణ జరపనున్నారు.
తోమర్ లా డిగ్రీని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఫిబ్రవరిలోనే పిటిషన్ దాఖలైంది. నకిలీ డిగ్రీ ఆధారంగా తోమర్ బీహార్లోని బిశ్వంత్సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగ ల్ స్టడీ కాలేజ్లో అడ్మిషన్పొందారని ఈ పిటిషన్ ఆరోపించింది. దీంతో తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవని బీహార్ విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.
బీహార్లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ విశ్వవిద్యాలయంలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా, అది నకిలీదని పేర్కొంటూ విశ్వవిద్యాలయం తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీంతో తోమర్కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.