ఇక బీరు తాగాలంటే బేర్ మనాల్సిందే, బీరు, మద్యం అమ్మకాలపై సుంకం పెంపు
బెంగళూరు: కర్ణాటకలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. బీరు సహా 17 రకాల మద్యం రేట్లు భారీగా పెరగబోతున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. మద్యం అమ్మకాలపై ఇప్పటిదాకా వసూలు చేస్తున్న ఆబ్కారీ సుంకం మొత్తాన్ని భారీగా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.
2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను శుక్రవారం ఆయన సభలో ప్రవేశపెట్టారు. బీరు, డ్రాట్ బీరు, మైక్రో బీరు, అతి తక్కువ అల్కహాల్ ఉన్న బేవరేజెస్ లపై సుంకాన్ని భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై అమల్లో ఉన్న నాలుగు శాతం ఆబ్కారీ సుంకాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.
అలాగే- 17 శ్లాబులకు అమలు చేస్తున్న ఆబ్కారీ సుంకాన్ని 15 శాతం నుంచి 34 శాతానికి పెంచుతూ బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచారు. మద్యం, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్, బీడీల విక్రయాలపైనా సుంకాన్ని పెంచారు. దీనివల్ల ఖజానాకు భారీగా అదనపు ఆదాయం వస్తుందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.
పెట్రో ఉత్పత్తులపైనా సుంకాన్ని సవరించారు. డీజిల్ అమ్మకాలపై ఇప్పుడు 19 శాతం సుంకం వసూలు చేస్తుండగా.. దీన్ని 22కు పెంచారు. ఫలితంగా- డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.1.12 పైసల మేర పెరుగుతుంది. పెట్రోల్ పై 30 శాతం ఉన్న సుంకాన్ని 32కు పెంచారు. దీనివల్ల పెట్రోల్ అమ్మకాల్లో లీటర్ ఒక్కింటికి రూ.1.14 పైసలు పెరుగుదల చోటు చేసుకుంటుంది.